నిజామాబాద్, జూన్ 23 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద సోమవారం వరకు జిల్లాలోని 2,68,056 మంది రైతుల ఖాతాలలో రూ. 310.43 కోట్ల నిధులు జమ అయ్యాయని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
వానాకాలం – 2025 సీజన్ కు సంబందించి పంట పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం జిల్లాలో మొత్తం 2,98,510 మంది రైతులకు రూ. 326.07 కోట్ల నిధులను నేరుగా వారి బ్యాంకు ఖాతాలలో జమ చేస్తోందని అన్నారు.
ఈ నెల 16వ తేదీన రెండు ఎకరాల లోపు వ్యవసాయ భూమి కలిగిన జిల్లాలోని 1,681,66 మంది రైతుల ఖాతాలలో ఎకరాకు ఆరు వేల రూపాయల చొప్పున రూ. 95.66 కోట్ల పంట పెట్టుబడి సాయం నిధులను ప్రభుత్వం రైతుల ఖాతాలలో జమ చేసిందని తెలిపారు.
17వ తేదీన మూడెకరాల వరకు సాగు భూమి ఉన్న 44,006 మంది రైతుల ఖాతాలలో రూ. 65.06 కోట్ల నిధులు,18, 19వ తేదీలలో ఐదెకరాల లోపు సాగు భూమి కలిగిన 26,075 మంది రైతుల ఖాతాలలో రూ. 53.84 కోట్ల నిధులు జమ చేసిందని వివరించారు.
20వ తేదీన 16958 మంది రైతుల ఖాతాలలో రూ. 45.25 కోట్ల నిధులు, 21వ తేదీన 8208 మంది రైతుల ఖాతాలలో రూ.27.97 కోట్ల నిధులు జమ అయ్యాయని అన్నారు.
అదేవిధంగా 22, 23వ తేదీలలో 4643 మంది రైతుల ఖాతాలలో రూ. 22.65 కోట్ల నిధులు జమ అయ్యాయని కలెక్టర్ వివరించారు.
మొత్తంగా సోమవారం నాటికి జిల్లాలోని 2,68,056 మంది రైతుల ఖాతాలలో రూ. 310.43 కోట్ల నిధులు జమ అయ్యాయని కలెక్టర్ తెలిపారు.
