ఎండ తీవ్రత దృష్ట్యా బాటసారుల దాహార్తిని తీర్చేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతి రెడ్డి అన్నారు. నగరంలోని 27వ డివిజన్ వర్ని చౌరస్తాలో ఖిల్లా రామ్ మందిర్ ప్రధాన కార్యదర్శి కల్పే చిరంజీవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని గురువారం ఆమె ప్రారంభించారు.
27వ డివిజన్ కార్పొరేటర్ కల్పే అర్చనతో కలిసి స్రవంతి రెడ్డి రిబ్బన్ కట్ చేసి ఈ సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా స్రవంతి రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఏటా వేసవిలో క్రమం తప్పకుండా చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తూ సామాజిక బాధ్యతను చాటుకుంటున్న చిరంజీవిని ప్రత్యేకంగా అభినందించారు.
ప్రజా సేవలో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని ఆమె ఆకాంక్షించారు. బాటసారులు, కూలీలు, సామాన్యుల సౌకర్యార్థం నగరంలోని కీలక ప్రాంతాల్లో ఇలాంటి కేంద్రాల అవసరం ఎంతైనా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ మహిపాల్, భక్త హిందూ యూత్ సభ్యులు, డివిజన్ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో స్థానికులు, ప్రయాణికులు ఈ చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.
