- 12 ఏళ్ల తర్వాత పోలీసు సంఘంలో ఎన్నికల సంగ్రామం!
- అధ్యక్ష పీఠం కోసం హోరాహోరీ.. పోలీసు వర్గాల్లో పెరిగిన ఉత్కంఠ..
- ఈనెల 27న అధ్యక్ష ఎన్నిక..
పోలీసు సంఘంలో ఎన్నికల సందడి నెలకొంది. దాదాపు 12 ఏళ్ల తర్వాత సంఘానికి ఎన్నికలు నిర్వహిస్తుండటంతో ఈసారి పోటీ రసవత్తరంగా మారింది. గతంలో ఏకగ్రీవంగా అధ్యక్షుడిని ఎన్నుకుంటూ వచ్చిన సంఘంలో.. ఈసారి పలువురు అధ్యక్ష పదవిని ఆశిస్తుండటంతో రాజకీయ ఎన్నికలను తలపించేలా సమీకరణాలు మొదలయ్యాయి.
అధ్యక్ష పీఠాన్ని దక్కించుకునేందుకు ముగ్గురు అభ్యర్థులు రంగంలోకి దిగడంతో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ముందుగా పోలీసు సంఘానికి 40 మంది సభ్యులను ఎన్నుకునే ప్రక్రియ కొనసాగుతోంది. సభ్యుల ఎన్నిక ప్రక్రియ పూర్తయిన అనంతరం ఈ నెల 27న అధ్యక్ష ఎన్నిక నిర్వహించనున్నారు.
జిల్లావ్యాప్తంగా అధ్యక్ష పదవిపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమకు మద్దతుగా నిలిచే సభ్యులతో మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే గత కొన్నేళ్లుగా ఏకగ్రీవమే ఆనవాయితీగా ఉన్న సంఘంలో ఈసారి పోటీకి తెరలేవడంతో ప్రతి ఓటు కీలకంగా మారింది.
40 మంది సభ్యుల మద్దతు ఎటువైపు మొగ్గుతుందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎవరి వెనుక ఎంత బలం ఉంది చివరి నిమిషంలో ఎలాంటి సమీకరణాలు చోటుచేసుకుంటాయి అన్నదానిపై పోలీసు వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
సభ్యుల ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుండగానే అధ్యక్ష పదవిని ఆశిస్తున్న అభ్యర్థులు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఒకవైపు మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు.. మరోవైపు ప్రత్యర్థుల బలాబలాలపై ఆరా.. ఇలా పోలీసు సంఘంలో ఎన్నికల సందడి కనిపిస్తోంది.
12 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికలు సాధారణ ఎన్నికలుగా కాకుండా పోలీసు సంఘంలో నాయకత్వ మార్పునకు వేదికగా మారుతాయా అన్నదే ఇప్పుడు హాట్టాపిక్. ఈ నెల 27న జరగనున్న అధ్యక్ష ఎన్నికతో పోలీసు సంఘం అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారో తేలిపోనుంది.
