ఖరీఫ్ ప్రారంభ సీజన్లో సహకార సంఘాల్లో యూరియా కొరతతో ఆర్మూర్ డివిజన్ లో గందరగోళ పరిస్థితి నెలకొంది. గంటలకు కొలది పడి కాపులు కాస్తున్న… అవసరానికి సరిపడ యూరియా దొరకడం లేదు.
ఓ పక్క ప్రభుత్వ యంత్రాంగం అసలు కొరతే లేదని భావిస్తుంటే.. క్షేత్రస్థాయిలో రైతులు మాత్రం ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. పంట పండించడానికి రైతులు పడే కష్టాలు చెప్పవలసిన అవసరం లేదు.
విత్తనాలు చల్లడం నుంచి, మార్కెట్లో పండిన గింజలను అమ్ముకునే వరకు.. ప్రతి అడుగు రైతుకు ఓ పరీక్షే. కొన్నిసార్లు ప్రకృతి వైపరీత్యాలు పరీక్షిస్తే, మరికొన్నిసార్లు దళారుల దందా నట్టేట ముంచుతుంది. ఇన్ని సుడిగుండాలు దాటుకుంటూ వస్తే మిగిలేది అంతంత మాత్రమే.
ఈ క్రమంలో యూరియా కోసం సహకార సంఘాల వద్ద పడిగాపులు కాస్తున్న, సరిపడా యూరియా తమకు లభించడం లేదని రైతులు అంటున్నారు.
ఇటీవల బాల్కొండ నియోజకవర్గం లోని రెంజర్ల సహకార సంఘం వద్ద యూరియా కోసం రైతులు చెప్పుల వరసతో క్యూ కట్టడం చర్చనీయాంశంగా మారింది.
ఈ అంశంపై ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తోపాటు బిఆర్ఎస్ కార్యకర్తలు సోషల్ మీడియాలో అధికార కాంగ్రెస్ పార్టీని యూరియా కొరతపై ప్రశ్నించారు.
దీనికి స్పందించిన బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్ సహకార సంఘాల వైఫల్యానికి యూరియా కొరతకు పూర్తిగా మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి కారణమని ఆరోపించారు.
దీంతో బాల్కొండ నియోజకవర్గంలో అన్ని సహకార సంఘాల్లో యూరియా కొరతను రైతులు ఎదుర్కొంటున్నారంటూ ఓ రాజకీయ దుమారం రేగింది.
తాజాగా ఆర్మూర్ సహకార సంఘం వద్ద మంగళవారం యూరియా కోసం వందలాదిగా తరలివచ్చిన రైతులకు సరిపడా లేకపోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
దీంతో రైతులు సహకార సంఘం ఎదుట బైఠాయించి ఈ సీజన్లో వ్యవసాయ పనులు ఊపందుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వం యంత్రాంగం కొరతను తీర్చకపోవడం వైఫల్యమెనంటు ఆందోళనకు దిగారు.
ఆర్మూర్ డివిజన్ లోని కొన్ని సహకార సంఘాల వద్ద యూరియా కొరత లేకపోయినప్పటికీ, ఎక్కువ గ్రామాల్లో రైతులు సాగు చేసుకోవడం కోసం కావాల్సినంత స్టాకు లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
అవసరానికి మించి రైతులు స్టాక్ చేసుకునే ప్రయత్నంలో ఈ కొరత ఏర్పడుతుందని, అంతేకాకుండా అధిక యూరియా వినియోగం కూడా దీనికి కారణమని అధికారులు అంటున్నారు.
ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఈ సీజన్ కు సరిపడా యూరియా సరాఫరా చేయాలని రైతుల డిమాండ్ చేస్తున్నారు.
