ఆరా తీస్తున్న అధికారులుతన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందనే ఆందోళనలో మేయర్ భర్త ఉన్నారా తనకు ఉన్నపలంగా రక్షణ కల్పించాలని ఆయన పోలీసు శాఖను ఆశ్రయించారని విశ్వసనీయంగా తెలిసింది.
గన్మెన్ సౌకర్యం కల్పించడంతో పాటు స్వతహాగా తుపాకీ కలిగి ఉండేలా లైసెన్స్ ఇవ్వాలని మేయర్ భర్త శేఖర్ స్థానిక పోలీసులకు దరఖాస్తు చేసుకున్నారు.
ఆయన దరఖాస్తు విషయంలో తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంలో పోలీసు ఉన్నతాధికారులు మల్ల గుల్లాలు పడుతున్నారు. ఆయనకు ఇంకా ఎవరెవరితో పాత కక్ష్యాలున్నాయి. ఎలాంటి వివాదాల్లో ఆయన ఉన్నారనేది స్థానిక పోలీసులు ఆరా తీస్తున్నారు.
నిబంధనల ప్రకారం గన్మెన్ సౌకర్యం కల్పించే పరిస్థితి లేదు. అందులోనూ ఆయన భార్య మేయర్ నీతూ కిరణ్కు ప్రొటొకాల్ మేరకు 1+1 గన్మెన్లున్నారు. అందుకే తుపాకి లైసెన్స్ ఇచ్చే విషయంలోనే తర్జనభర్జనలు జరుగుతున్నాయి.
నిబంధనల మేరకు లైసెన్స్ ఇవ్వాలని ఆలోచనలో పోలీసు ఉన్నతాధికారులున్నారు. మేయర్ భర్త శేఖర్ మీద ఇటీవలే నాగారం ప్రాంతానికి చెందిన ఆటోడ్రైవర్ రసూల్ సుత్తేతో దాడి చేసి కొట్టారు.
తటిలో ప్రాణాపాయం తప్పింది. బీఆర్ఎస్కు చెందిన శేఖర్ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో సర్జరీ చేశారు. రెండు రోజుల క్రితమే డిశ్చార్జ్ అయ్యారు. ఈ దాడి నగరంలో రాజకీయ దుమారం రేపింది. దాడి వెనుక కాంగ్రెస్ నేతల ప్రమేయం ఉందని మాజీ మంత్రితో పాటు మాజీ ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీ మీద నిప్పులు చెరిగారు.
ఆయనకు పరామర్శలు వెలువెత్తాయి. బీఆర్ఎస్ నేతల ఆరోపణలను కాంగ్రెస్ నేతలు తిప్పికొట్టారు. దాడితో తమకేమి సంబంధం లేదని నిందితుడి రసూల్తో పార్టీకి సంబంధం లేదని రసూల్ మేయర్ భర్త శేఖర్కు ముఖ్య అనుచరుడేనని ఎదురు దాడి చేయడమే కాదు నిందితుడు రసూల్ మేయర్ భర్త శేఖర్తో కలిసి ఉన్న వీడియోలను సోషియల్ మీడియా వేదికల మీద వదిలారు.
దీంతో బీఆర్ఎస్ నేతలు ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. మొత్తానికి ఈ దాడి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా మారింది. మరో వైపు దాడి ఘటనను సీరియస్గా భావించిన పోలీసులు నిందితుడిని కొద్దీ గంటల్లో పట్టుకొని రిమాండ్ చేశారు. సంఘటనకు దారి తీసిన పరిస్థితులను పక్కాగా నిర్దారించుకున్నారు.
దర్యాప్తు సైతం ఓ కొలిక్కి తెచ్చారు. నిందితుడికి అధికార పార్టీ వైపు నుంచి ఏదైన సహకారం ఉందా అనే కోణంలోనూ ఆరా తీశారు. అయితే ఈ ఎపిసోడ్ అవ్వగానే బాధితుడు శేఖర్ గన్మెన్ కోరడం పోలీస్శాఖలో చర్చనీయాంశమైంది.
