ముగిసిన అగ్నిమాపక వారోత్సవాలుఅగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. జిల్లా కేంద్రంలో వారం రోజులుగా నిర్వహిస్తున్న అగ్నిమాపక వారోత్సవాలు సోమవారం ఘనంగా ముగిశాయి.
స్థానిక అగ్నిమాపక కేంద్రంలో జరిగిన ముగింపు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై అగ్నిమాపక సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా అత్యవసర సమయాల్లో వినియోగించే ఆధునిక అగ్నిమాపక పరికరాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించి, వాటి పనితీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు.
వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖన పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు, అలాగే గత ఏడాది వరదల సమయంలో సాహసోపేతంగా విధులు నిర్వహించిన ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందికి సీపీ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.
అనంతరం విధుల్లో విశేష సేవలందించి పదవీ విరమణ పొందిన ఉద్యోగులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ సభ్యులు ఉత్తమ సేవలు అందించిన ఫైటర్లను అభినందించారు.
కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక అధికారి టి.పరమేశ్వర్, కేంద్ర అధికారులు ఎ.శంకర్, ఎ.విక్రమ్, కె.సుభాష్, ఆర్.నరేష్, బి.శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
