మొహరం పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం నగరంలో వేడుకలు భక్తిశ్రద్ధలతో సాగాయి. ఈ వేడుకల్లో భాగంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి టి.హరీష్రావు ప్రత్యేకంగా పాల్గొని ప్రార్థనలు చేశారు. హరీష్రావు మధ్యాహ్నం హైదరాబాద్లోని అజాంపురాలో ఉన్న మాజీ హోంమంత్రి మహమ్మద్ అలీ నివాసానికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా ఆయనకు మహమ్మద్ అలీ సాదర స్వాగతం పలికారు. ఇరువురు నేతలు పరస్పరం మొహరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ఈ భేటీ సందర్భంగా స్థానిక పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు హరీష్రావును కలిసి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం హరీష్రావు దబీర్పురాలోని ప్రముఖ ‘బీబీ కా అలం’ సందర్శించారు.
అక్కడ ఏర్పాటు చేసిన మొహరం వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. సంప్రదాయబద్ధంగా దట్టీలను సమర్పించి, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
రాష్ట్రంలో సుభిక్షంగా వర్షాలు కురవాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో, శాంతి సామరస్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
