విఘ్నాలను తొలగించే గణనాథుడి రాక కోసం ఇందూరు ముస్తాబైంది. వినాయక చవితి సందర్భంగా సోమవారం నుంచి గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానుండటంతో నగరంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ పండగ సందడి నెలకొంది. ఇప్పటికే గణేష్ మండపాల ఏర్పాట్లు పూర్తికాగా.. మరికొద్ది గంటల్లో ప్రతిమలను ప్రతిష్ఠించేందుకు నిర్వాహకులు సన్నద్ధమయ్యారు.
పూలు, విద్యుద్దీపాలతో అలంకరించిన మండపాలు.. ఆకట్టుకునే రూపాల్లో కొలువుదీరనున్న గణనాథుల ప్రతిమలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. మరోవైపు పూజా సామగ్రి కొనుగోళ్లతో ప్రధాన మార్కెట్లు రద్దీగా మారాయి.
వాడవాడలా మండపాల ఏర్పాటు
నగరంలోని ప్రధాన కూడళ్లతోపాటు కాలనీలు, గ్రామాల్లో గణేష్ మండపాలను ఏర్పాటు చేశారు. యువత, ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో మండపాలను రంగురంగుల విద్యుద్దీపాలు, పూలతో అలంకరించారు.
పలుచోట్ల గణపతి ప్రతిమలను ఇప్పటికే మండపాలకు తరలించగా.. మరికొన్ని చోట్ల సోమవారం ప్రత్యేక పూజల అనంతరం ప్రతిష్ఠించేందుకు ఏర్పాట్లు చేశారు. తొమ్మిది రోజులపాటు పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించేందుకు నిర్వాహకులు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.
మట్టి వినాయకులపై ఆసక్తి
పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతి ప్రతిమలకు ఈసారి ప్రాధాన్యం పెరిగింది. ఇళ్లలో ప్రతిష్ఠించే భక్తులతోపాటు ఉత్సవ కమిటీలు సైతం మట్టి విగ్రహాల వైపు మొగ్గు చూపుతున్నాయి. వివిధ ఆకృతులు, పరిమాణాల్లో తయారైన మట్టి వినాయకులు అందుబాటులోకి వచ్చారు.
పలుచోట్ల స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు ఉచితంగా మట్టి విగ్రహాలను పంపిణీ చేశాయి.
ఉండ్రాళ్లు.. పత్రితో ప్రత్యేక పూజలు
వినాయకుడికి ఇష్టమైన పత్రి, పూలతో ప్రత్యేక పూజలు చేసేందుకు భక్తులు ఏర్పాట్లు చేసుకున్నారు. ఉండ్రాళ్లు, పాయసం తదితర నైవేద్యాలను సమర్పించనున్నారు.
ఇళ్లలోనూ చిన్నపాటి మండపాలను ఏర్పాటు చేసి కుటుంబ సభ్యులతో కలిసి గణపతిని ప్రతిష్ఠించేందుకు సిద్ధమయ్యారు. పలు ఉత్సవ మండపాల్లో భజనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
కొనుగోళ్లతో మార్కెట్లు కిటకిట
వినాయక చవితి నేపథ్యంలో ఆదివారం నుంచే నగరంలోని మార్కెట్లకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
పూలు, పండ్లు, పత్రి, కొబ్బరికాయలు, పూజా సామగ్రి, స్వీట్లు తదితరాల కొనుగోళ్లతో మార్కెట్లు సందడిగా మారాయి. తుమ్మి, ఒనగాయ తదితర పత్రి రకాలతోపాటు పూలకు డిమాండ్ పెరిగింది. కొనుగోళ్ల కోసం ప్రజలు తరలిరావడంతో ప్రధాన రహదారుల్లో రద్దీ నెలకొంది. డిమాండ్ పెరగడంతో పూలు, పండ్లు, పూజా సామగ్రి ధరల్లోనూ కొంత పెరుగుదల కనిపించింది.
