బాన్సువాడ పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న సర్దేవర్ అమృత (17) ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది.
స్థానికుల సమాచారం మేరకు.. జుక్కల్ నియోజకవర్గం, డోంగ్లి మండలం లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన అమృత, బాన్సువాడలోని వసతి గృహంలో ఉంటూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతోంది.
బుధవారం ఉదయం తోటి విద్యార్థులందరూ కళాశాలకు వెళ్లిన తర్వాత, అమృత హాస్టల్లోనే ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె తల్లిదండ్రులు తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న బాన్సువాడ ఆర్డీవో రవీందర్ రెడ్డి వసతి గృహాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.
అనంతరం వసతి గృహాల జిల్లా అధికారి వెంకటేశం ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ధర్నా, రాస్తారోకోతో ఉద్రిక్తత విద్యార్థిని మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని, హాస్టళ్లలో జరుగుతున్న వరుస సంఘటనలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు, బీఆర్ఎస్ నాయకులు నిరసనకు దిగారు.
బాన్సువాడలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు షేక్ జుబేర్, విద్యార్థి సంఘాల ప్రతినిధులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ ఆందోళనలతో ప్రధాన రహదారిపై వాహనాలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.
