సమాజంలో అణగారిన వర్గాల కోసం జీవితాంతం పోరాడిన మహా యోధుడు, మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ అని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. ఆదివారం నగరంలోని రైల్వే కమాన్ వద్ద గల అంబేద్కర్ భవన్ లో జగ్జీవన్ రామ్ జయంతి నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనడమే కాకుండా … స్వాతంత్రం వచ్చిన తర్వాత సామాజిక న్యాయం కోసం నిరంతరం కృషి చేశారన్నారు. ప్రత్యేకంగా దళితుల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం అందరికీ ఆదర్శమన్నారు. ఆయన చూపిన మార్గంలో నడవడం ద్వారా మాత్రమే నిజమైన సమానత్వాన్ని సాధించగలమని పేర్కొన్నారు.
కేంద్ర మంత్రివర్గంలో కార్మిక శాఖ, రైల్వే శాఖ, వ్యవసాయ శాఖ, రక్షణ శాఖ మంత్రిగా పనిచేశారని గుర్తు చేశారు. దేశంలో మొట్టమొదటి క్యాబినెట్ మంత్రి గానే కాకుండా అత్యధిక కాలం పాటు పనిచేసిన మంత్రిగా రికార్డు సృష్టించారని కొనియాడారు. కులం, మతం, భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు రావాలన్నారు.
భారత రత్న కు మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ ముమ్మాటికి అర్హుడేనని, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్తామన్నారు. అలాగే నగరంలోని రైల్వే కమాన్ వద్ద గల అంబేద్కర్ భవనానికి తమ ట్రస్ట్ శ్రీ ధన్ పాల్ లక్ష్మీబాయి విట్టల్ గుప్తా ద్వారా తమ వంతు సహాయం అందిస్తామన్నారు.
అంతకుముందు రైల్వే కమాన్ చౌరస్తా లోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, మైనార్టీ కమిషన్ చైర్మన్ తారిఖ్ అన్సారీ, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్, వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, మేయర్ ఉమారాణి, ఆర్డీవో రాజేంద్రకుమార్, డీడీ రాజ్ గంగారాం తదితరులు పాల్గొన్నారు.
