నక్సలిజాన్ని సమష్టి కృషితో తరిమికొట్టినట్టే.. యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న డ్రగ్స్ మాఫియాను కూడా సమాజం నుంచి పూర్తిగా అణచివేయాలని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. మత్తు పదార్థాలకు యువతను దూరంగా ఉంచి ‘నశా ముక్త్ సమాజ్’ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు.
నిజామాబాద్లో నిర్వహించిన యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా మాట్లాడారు. దేశానికి, రాష్ట్రానికి యువతే అతిపెద్ద బలమని పేర్కొన్నారు.
యువత మత్తు పదార్థాలకు బానిసైతే వారి భవిష్యత్తుతో పాటు కుటుంబాలు, సమాజం తీవ్రంగా నష్టపోతాయని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రారంభమైన ‘నశా ముక్త్ భారత్ అభియాన్’ దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమంగా మారుతోందని తెలిపారు.
పాఠశాలలు, కళాశాలల్లో మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని గవర్నర్ సూచించారు. విద్యార్థులను భాగస్వాములను చేస్తూ ఏర్పాటు చేస్తున్న యాంటీ డ్రగ్ కమిటీలు, ప్రహరి క్లబ్లు మంచి ఫలితాలు ఇస్తున్నాయని అన్నారు.
ప్రతి విద్యార్థి డ్రగ్స్కు వ్యతిరేకంగా తన కుటుంబం, స్నేహితులు, పరిసరాల్లో అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. విద్యాసంస్థల పరిసరాల్లో మత్తు పదార్థాలను విక్రయిస్తూ పిల్లల జీవితాలతో చెలగాటమాడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
డ్రగ్స్ సరఫరా చేసే ముఠాలను గుర్తించి అణచివేయడంతో పాటు యువత మత్తు బారిన పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ‘నశా రహిత ఇల్లు.. నశా రహిత గ్రామం.. నశా రహిత తెలంగాణ.. నశా రహిత భారత్’ అనే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని గవర్నర్ పిలుపునిచ్చారు.
డ్రగ్స్పై పోరాటం కేవలం ప్రభుత్వానిదో, పోలీసులదో కాదని.. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు అందరూ కలిసి పనిచేయాల్సిన సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు.
మత్తు పదార్థాల నిర్మూలనలో యువతను చైతన్యవంతం చేయడం అత్యంత కీలకమని అన్నారు. ఆరోగ్యకరమైన, మత్తు రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ సంకల్పం తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, నగర మేయర్ కూరగాయల ఉమారాణి, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
