నగరంలో శాంతిసౌభ్రాతృత్వాలను చాటిచెప్పేందుకు శనివారం మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ ఆధ్వర్యంలో ‘పీస్ ర్యాలీ’ ఘనంగా నిర్వహించారు. “అన్ని మతాలు సమానమే” అన్న నినాదంతో సాగిన ఈ కార్యక్రమంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు పెద్ద ఎత్తున పాల్గొని మత సామరస్యాన్ని చాటారు. నగర పురవీధుల గుండా సాగిన ఈ ర్యాలీ పండుగ వాతావరణాన్ని తలపించింది.
ఈ సందర్భంగా ధర్మపురి సంజయ్ మాట్లాడుతూ.. ఒక వ్యక్తి తనకు ఫోన్ చేసి చేసిన సవాల్ మేరకే ఈ శాంతి ర్యాలీని తలపెట్టినట్లు వెల్లడించారు. సమాజంలో విద్వేషాలకు తావులేకుండా, అందరూ కలిసిమెలిసి ఉండాలన్నదే తన ఆకాంక్ష అని పేర్కొన్నారు. రాజనీతిజ్ఞుడు, దివంగత నేత ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) కడుపున పుట్టడం తన అదృష్టమని, అది తనకు గర్వకారణమని భావోద్వేగంతో పలికారు.
ఇక్కడ ఉన్న వారందరూ డీఎస్ వారసులేనని, ఆయన ఆశయాలకు అనుగుణంగానే తాను ముందుకు సాగుతున్నానని తెలిపారు. గతంలో డీఎస్ చేసిన అభివృద్ధి పనులను ఈ సందర్భంగా సంజయ్ గుర్తుచేశారు. తాను మేయర్గా ఉన్న సమయంలో నిధులను తీసుకువచ్చి నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశానని గుర్తు చేశారు.
నగరాభివృద్ధిలో తనవంతు పాత్ర పోషించినందుకు గర్వపడుతున్నానని, భవిష్యత్తులోనూ ప్రజల మధ్య శాంతిని కాపాడేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ మతాలకు చెందిన పెద్దలు, యువకులు, డీఎస్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు.
