ఆకలితో ఉన్నవారి కడుపు నింపడమే నిజమైన మానవత్వమని, ఇందుకు ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమాలు నిలువెత్తు నిదర్శనమని జిల్లా పోలీస్ కమిషనర్ పి. సాయిచైతన్య కొనియాడారు.
శనివారం సుభాష్నగర్లోని పెన్షనర్స్ భవన్లో ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 1800 రోజులుగా కొనసాగుతున్న నిర్విరామ అన్నదాన కార్యక్రమ మైలురాయిని పురస్కరించుకుని ‘అన్నార్తుల అన్నదాన సేవ తత్పరత-2026’ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీ సాయిచైతన్య ముఖ్య అతిథిగా, డీసీఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి విశిష్ట అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఒక యజ్ఞంలా ప్రతిరోజూ నిరుపేదల ఆకలి తీర్చడం గొప్ప విషయమన్నారు. గత 15 ఏళ్లుగా ఈ సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాల వీడియోలను ఆయన వీక్షించి హర్షం వ్యక్తం చేశారు. యువత ఇలాంటి సేవా మార్గంలో పయనించాలని పిలుపునిచ్చారు. అనంతరం డీసీఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. అనాథలకు, అభాగ్యులకు అండగా నిలుస్తూ సంస్థ అందిస్తున్న సేవలు అమోఘమని ప్రశంసించారు.
నిస్సహాయ స్థితిలో రోడ్లపై తిరుగుతున్న మానసిక వికలాంగులు, అనాథ వృద్ధులకు సపర్యలు చేసేందుకు మార్చి 28 నుంచి ఏప్రిల్ 28 వరకు చేపట్టనున్న ప్రత్యేక సేవా కార్యక్రమ పోస్టర్ను అతిథులు ఆవిష్కరించారు. అలాగే అన్నదానానికి సంబంధించిన పోస్టర్ను కూడా విడుదల చేశారు.
కార్యక్రమంలో నృత్య ప్రదర్శనలు చేసిన చిన్నారులకు మెమొంటోలు అందజేశారు. ఈ వేడుకలో ఇందూరు యువత సంస్థ ప్రతినిధులు మద్దుకూరి సాయిబాబు, వాల బాలకిషన్, మద్ది గంగాధర్, సుజాత రెడ్డి, విజయనంద్, యువి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సుజన్ కుమార్, హన్మండ్లు, దర్శనం రాజు, కనకన్న, సుధాకర్, రఘు రాములు, సంతోష్, రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు
