జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ నత్తనడకన సాగుతుండటంపై భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులచారి ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలపై శనివారం ఆయన పార్టీ ముఖ్య నేతలతో కలిసి అదనపు కలెక్టర్ను కలిశారు.
సుమారు గంటకు పైగా అధికారులతో సుదీర్ఘంగా చర్చించిన ఆయన.. ధాన్యం సేకరణలో జరుగుతున్న జాప్యంపై నిలదీశారు. కొనుగోళ్లు వేగవంతం చేయకపోతే మంగళవారం తర్వాత జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని, కలెక్టరేట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
ధాన్యం కొనుగోళ్లలో జాప్యం వల్ల రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని దినేష్ పటేల్ ఆవేదన వ్యక్తం చేశారు. మొన్న మోపాల్ మండల పర్యటనలో లారీల కొరతను అధికారుల దృష్టికి తీసుకెళ్లగా కొన్ని ఏర్పాటు చేసినా.. క్షేత్రస్థాయిలో ఇంకా సమస్యలు వేధిస్తున్నాయని తెలిపారు.
సుమారు 180 దొడ్డు రకం ధాన్యం లారీలు రైస్ మిల్లుల వద్ద అన్-లోడింగ్ కాక నిలిచిపోయాయని అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన అధికారి.. మిల్లర్లతో మాట్లాడి అన్-లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు.
బోధన్లోని కొన్ని రైస్ మిల్లులకు ధాన్యం కేటాయింపు (అలాట్మెంట్) విషయంలో జిల్లా అధికారులు సానుకూలంగా స్పందించకపోవడంతో, దినేష్ పటేల్ వెంటనే సివిల్ సప్లైస్ కమిషనర్ స్టీఫెన్ రవీందర్తో ఫోన్లో మాట్లాడారు. కమిషనర్ సానుకూలంగా స్పందించి జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేయడంతో కేటాయింపుల ప్రక్రియ సజావుగా సాగింది.
ఈ సందర్భంగా కమిషనర్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రైతుల దుస్థితిని వివరించగా.. రాబోయే రెండు మూడు రోజుల్లో (మంగళవారం లోపు) జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేస్తామని అదనపు కలెక్టర్ హామీ ఇచ్చారు. గడువులోగా సమస్య పరిష్కారం కాకపోతే బీజేపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడికి వెనుకాడబోమని దినేష్ పటేల్ స్పష్టం చేశారు.
కార్యక్రమంలో సీనియర్ నాయకులు పద్మా రెడ్డి, నాయిడి రాజన్న, కార్పొరేటర్లు చింత శ్రీనివాస్ రెడ్డి, పసునూరి రమేష్, సీనియర్ నాయకులు శంకర్ రెడ్డి, మండల అధ్యక్షులు ఆనంద్, మాజీ కార్పొరేటర్ కోర్వ గంగాధర్, చికోటి రవి, ఎర్రం సుధీర్ తదితరులు పాల్గొన్నారు.
