నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డు బుధవారం రణరంగాన్ని తలపించింది. పసుపుకు ఆశించిన ధర లభించకపోవడం, అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మార్కెట్ కమిటీ కార్యాలయాన్ని ముట్టడించి, లోపలికి దూసుకెళ్లిన నిరసనకారులు అక్కడి కుర్చీలను ధ్వంసం చేశారు.
దీంతో యార్డులో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మార్కెట్ అధికారులు, వ్యాపారులు కుమ్మక్కై తమను నిలువునా ముంచుతున్నారని రైతులు మండిపడ్డారు.
క్వింటా పసుపుకు కనీస మద్దతు ధర దక్కకుండా దళారులు చక్రం తిప్పుతున్నారని, ఫలితంగా తాము తీవ్రంగా నష్టపోతున్నామని కన్నీరుమున్నీరయ్యారు. శ్రమ నీరుగాిపోతుంటే అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
చెమటోడ్చి పండించిన పంటకు గిట్టుబాటు ధర అడిగితే తక్కువ ధర కోట్ చేస్తూ మమ్మల్ని మోసం చేస్తున్నారు. దళారుల దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోయిందనీ వాపోయారు. ప్రస్తుతం ఉన్న విధానంతో పారదర్శకత లోపించిందని, వెంటనే పాత పద్ధతిలో ఈ-నామ్ ద్వారా కొనుగోళ్లు చేపట్టాలని రైతులు డిమాండ్ చేశారు.
మార్కెట్ ఒడిదుడుకులకు గురికాకుండా పసుపుకు సరైన ధర కల్పించాలని కోరారు. రైతుల ఆందోళన ఉధృతం కావడంతో సమాచారం అందుకున్న పోలీసులు భారీగా మార్కెట్ యార్డుకు చేరుకున్నారు.
కార్యాలయం ముట్టడికి ప్రయత్నించిన రైతులను అడ్డుకున్నారు. నిరసనకారులకు, పోలీసులకు మధ్య స్వల్ప తోపులాట జరగడంతో వాతావరణం వేడెక్కింది. చివరకు ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని, సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.
