విద్యార్థులు చిన్నతనం నుంచే కష్టపడే తత్వాన్ని అలవర్చుకోవాలని, అప్పుడే అనుకున్న లక్ష్యాలను సాధించి ఉజ్వల భవిష్యత్తును సొంతం చేసుకుంటారని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పేర్కొన్నారు. బుధవారం బోధన్ పట్టణంలోని ఉషోదయ మహిళా జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థినులను ఆయన ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా స్థానిక డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీపీ మాట్లాడారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ కోర్సుల్లో విద్యార్థినులు కనబరిచిన ప్రతిభ అభినందనీయమన్నారు. తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో పిల్లలను చదివిస్తారని, వారి కలలను నిజం చేసినప్పుడే చదువుకు సార్థకత లభిస్తుందని హితవు పలికారు. క్రమశిక్షణతో కూడిన విద్యతో ఉన్నత శిఖరాలను అధిరోహించి, కళాశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అనంతరం రమాకాంత్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కళాశాల వార్షికోత్సవ వేడుకల్లో సీపీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో రహదారి భద్రతపై అరైవ్-అలైవ్ ప్రతిజ్ఞ చేయించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, అప్పుడే రోడ్డు ప్రమాదాలను నివారించగలమని తెలిపారు. యువత డ్రగ్స్ వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, నేరాల నియంత్రణలో విద్యార్థి దశ నుంచే బాధ్యతగా మెలగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉషోదయ విద్యాసంస్థల చైర్మన్ ప్రకాష్, డైరెక్టర్ దుష్యంత్, బోధన్ ఏసీపీ శ్రీనివాస్, పట్టణ ఎస్.హెచ్.ఓ వెంకట్ నారాయణ, కళాశాల అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
