ఆర్టీసీ కార్మికులు కదనరంగంలోకి దూకారు. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వంపై పోరుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఐకాస పిలుపు మేరకు మంగళవారం అర్ధరాత్రి నుంచే సమ్మెకు దిగారు.
దీంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రజా రవాణా వ్యవస్థ ఒక్కసారిగా స్తంభించిపోయింది. ఉమ్మడి జిల్లాలోని అన్ని డిపోల పరిధిలో ఉన్న 650 బస్సులు బయటకు రాకుండా కార్మికులు అడ్డుకున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా.. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తోందని కార్మికులు మండిపడుతున్నారు. ప్రధానంగా.ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. పీఆర్సీ, పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. ఉద్యోగ విరమణలే తప్ప కొత్త నియామకాలు లేకపోవడంతో పనిభారం పెరిగింది.
సుమారు 18000 ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. 8 గంటలు పనిచేయాల్సిన చోట 12 నుంచి 18 గంటల పాటు వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారని కార్మికులు వాపోతున్నారు. అలాగే లాంగ్ రూట్ బస్సుల్లో కండక్టర్లు లేకుండా డ్రైవర్లకే ‘టిమ్స్’ యంత్రాలు ఇచ్చి టిక్కెట్లు కొట్టమనడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.
అదనపు పని గంటలకు ‘స్పెషల్ ఆఫ్’ కూడా ఇవ్వడం లేదని, ఇది డ్రైవర్లను మానసిక ఒత్తిడికి గురిచేస్తోందని నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే విద్యుత్ బస్సులను కొనుగోలు చేయాలన్న విజ్ఞప్తులు బుట్టదాఖలు కావడాన్ని వారు తప్పుబడుతున్నారు.
అధికారులు ప్రత్యామ్నాయంగా సుమారు 50వరకు బస్సులను నడిపినప్పటికీ ప్రయాణికుల రద్దీకి అవి ఏమాత్రం సరిపోవడం లేదు.
