అటవీ ప్రాంతంలోకి వెళ్లిన ఓ యువకుడిపై ఎలుగుబంటి దాడి చేసి గాయపరిచిన ఘటన సిరికొండ మండలంలో కలకలం రేపింది. మండలంలోని లొంక తాండాకు చెందిన బాణవ అరవింద్ (18) గురువారం ఉదయం స్థానిక అటవీ ప్రాంతంలోని ముక్క మైసమ్మ దేవాలయం సమీపంలోకి వెళ్లగా, ఒక్కసారిగా పొదల చాటు నుంచి వచ్చిన ఎలుగుబంటి అతనిపై విరుచుకుపడింది.
ఈ హఠాత్పరిణామంతో భీతిల్లిన అరవింద్ కేకలు వేయడంతో సమీపంలో ఉన్న స్థానికులు అక్కడికి చేరుకున్నారు. జనం రావడాన్ని గమనించిన ఎలుగుబంటి అడవిలోకి పారిపోయింది. ఈ దాడిలో అరవింద్ ఎడమ భుజానికి తీవ్ర గాయాలయ్యాయి.
బాధితుడిని వెంటనే చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.
