విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి, సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ఒక యువకుడిని మలక్పేట పోలీసులు అరెస్టు చేశారు.
నిందితుడి నుంచి సుమారు రూ.4 లక్షల విలువైన ఏడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల చోరీకి గురైన వాహనాలపై క్రైమ్ టీమ్ ప్రత్యేక నిఘా ఉంచింది.
ఈ క్రమంలోనే ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న బండ్రవల్లి రాకేష్ అలియాస్ రాఖీ అలియాస్ లడ్డూను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఇతను డిగ్రీ చదువుతున్నాడని పోలీసులు తెలిపారు. జూన్ 29వ తేదీ రాత్రి 10:30 గంటలకు ఇతనిని అరెస్టు చేసి, సెక్షన్ 303(2) బీఎన్ఎస్ కింద కేసు నమోదు చేశారు. అనంతరం నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. నిందితుడు రాకేష్పై గతంలోనే వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో 18 క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి.
జైలు నుంచి విడుదలైన కొద్ది కాలానికే మళ్ళీ పాత పద్ధతిలోనే నేరాలకు పాల్పడుతున్నాడు. కేవలం 30 రోజుల వ్యవధిలోనే డూప్లికేట్ తాళాల సాయంతో ఏడు వాహనాలను దొంగిలించినట్లు పోలీసులు గుర్తించారు. దొంగిలించిన వాహనాలను హస్తినాపురం, సహారా ఎస్టేట్స్, పసుమాముల ప్రాంతాల్లో తన సహచరుల వద్ద దాచిపెట్టి, సమయం చూసి విక్రయించేవాడని తేలింది.
ఈ దొంగతనాలు మలక్పేట, చైతన్యపురి, వనస్థలిపురం, సరూర్నగర్, నాగోల్, లాలాగూడ పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగినట్లు విచారణలో వెల్లడైందని అన్నారు.
మలక్పేట డివిజన్ ఏసీపీ ఎల్. రాజా వెంకట్ రెడ్డి పర్యవేక్షణలో, ఇన్స్పెక్టర్ కె. నరసింహ, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ధర్మిరెడ్డి గిరి మార్గదర్శకత్వంలో ఎస్సై ఎం. తేజ్య నాయక్, క్రైమ్ సిబ్బంది ఈ ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేశారు.
నేరస్థులపై కఠినంగా వ్యవహరిస్తామని, ప్రజలు తమ వాహనాలను సురక్షిత ప్రాంతాల్లోనే పార్కింగ్ చేసుకోవాలని పోలీసులు సూచించారు.
