ఆర్మూర్: సంక్షేమపై దృష్టి పెట్టాల్సిన నేతలు సవాల్ కు ప్రతి సవాల్ విసురుకుంటున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ బాహబాహికి దిగుతున్నారు. పాలన వైఫల్యం నీదే అని ఒకరు అంటుంటే..
సంక్షేమంలో నిర్లక్ష్యం మీరే మరిచారు అంటూ మరొకరు సవాల్ విసురుకుంటున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఏకంగా బస్తీమే సవాల్ అంటూ బాల్కొండ రాజకీయ నేతలు సరికొత్త రాజకీయ చదరంగానికి నాంది పలుకుతున్నారు. గతంలో నిజామాబాద్ జిల్లా రాజకీయ చరిత్రలో ఎన్నడు లేని విధంగా గత కొంతకాలంగా బాల్కొండ రాజకీయ వేడి చర్చనీయాంశంగా మారింది.
మొన్న భీంగల్, నిన్న వేల్పూర్, నేడు ముప్కాల్ అన్న చందంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బి ఆర్ ఎస్, మరోవైపు బిజెపి నేతలు కయ్యానికి కాలు దువ్వుతూ కథనరంగానికి సై అంటున్నారు.
అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి..? తులం బంగారం ఎక్కడ..? అంటూ గత జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి సమక్షంలో భీంగల్ మండల కేంద్రంలో కాంగ్రెస్, బి ఆర్ ఎస్ నేతల మధ్య రాజకీయ రణరంగం జరిగింది.
అది మరవకముందే నిన్న వేల్పూర్ వేదికగా బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి గల్ఫ్ కార్మికుల సంక్షేమంపై సవాలు మేస్త్రి ‘చలో వేల్పూర్’ కు పిలుపునిచ్చారు.
ఈ క్రమంలో వేల్పూర్ వేదికబగా ఇరు పార్టీ కార్యకర్తల మధ్య ఉద్రిక్తత నెలకొంది. అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎన్నారై రాష్ట్ర స్థాయి నాయకుడు దేవేందర్ రెడ్డిని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఇంట్లోకి నిలదీశెందుకు చొరబడ్డాడు అంటూ బి ఆర్ ఎస్ కార్యకర్తలు బట్టలు చినిగేలా కొట్టి.. అంకుశం సినిమాను మరిపించారు.
తాజాగా ఈ ఘటన మరువక ముందే గురువారం ముప్కాల్ మండల కేంద్రంలో మాజీ సర్పంచ్ కొమ్ముల శ్రీనివాస్ అవినీతి అక్రమాలపై అదే గ్రామానికి చెందిన బీజేవైఎం నేత సంతోష్ సవాల్ కు పిలుపునివ్వడంతో…
కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ శ్రీనివాస్ సవాల్ ను స్వీకరించి, తనపై వచ్చిన అవినీతి ఆరోపణలకు సమాధానం చెప్పడానికి సిద్ధం అంటూ.. గ్రామ నట్ట నడిబోడ్డు వద్దకు రావడంతో ఉద్రిక్తత నెలకొంది.
ఈ సవాల్ కు ప్రతి సవాళ్లను నివారించడానికి పోలీసులు శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించగా, సంతోష్ ను హౌస్ అరెస్ట్ చేశారు.
ఇలా ఎప్పుడు లేనంతగా… ప్రజా సంక్షేమం మీద దృష్టి పెట్టాల్సిన ఈ ఖద్దరు నేతలు సవాల్ కు .. ప్రతి సవాల్ విసురుకుంటూ పోలీసులకు తలనొప్పిగా మారారు.
ఇప్పటికైనా ఇటువంటి అనారోగ్యకరమైన రాజకీయ పరిస్థితులు మారాలని, నేతలు ప్రజాసంక్షేమముపై పోటీ పడాలని బాల్కొండ నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు. నేతల తీరు ఎలా మారుతుందో వేచి చూడాల్సిందే..!
