రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో దాశరథి కృష్ణమాచార్యులు శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని లేకపోతే తెలంగాణ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహిస్తామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని జిల్లా రఘునాథ ఆలయాన్ని,ఖిల్లా జైలును సందర్శించారు.
అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. దాశరథి కృష్ణమాచార్యుల శతజయంతి వేడుకలపై ప్రభుత్యం ప్రకటన చేయాలని కోరారు. లేదంటే జూలై 20, 21న జాగృతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తామని ప్రకటించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం దాశరథి కృష్ణమాచార్యులు శతజయంతి వేడుకలను పట్టించుకోవడంలేదని తెలిపారు. నిజాం ఆకృత్యాలను ఎండకడుతూ ప్రజలని జాగృతి చేసిన దాశరథి జయంతి వేడుకలను నిర్వహించకపోవడం సిగ్గుచేటు అన్నారు.
నిజామాబాద్ ఖిల్లా జైలు గోడలపై “నా తెలంగాణ కోటి రతనాల వీణ” అని వ్రాసి తెలంగాణ ప్రజలను చైతన్య పరిచారని గుర్తు చేశారు. ఆయన శిక్ష అనుభవించిన జైలును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ఉద్దేశంతో గతంలో తమ ప్రభుత్వ సమయంలో నిధులు విడుదల చేసినట్లు తెలిపారు.
అలాగే తాను ఎంపీగా ఉన్న సమయంలో రెండు కోట్లు విడుదల చేశానని అన్నారు.కానీ దురదృష్టవశాత్తు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగా వాటిని నిలిపివేసింది అన్నారు.
సమావేశంలో మాజీ మేయర్ నీతు కిరణ్, జాగృతి నాయకులు ఘనపురం దేవేందర్, చరిత్రకారులు కందకుర్తి ఆనంద్, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
