50 ఏళ్లు దాటిన సిబ్బంది, కుటుంబ సభ్యులు సద్వినియోగం చేసుకోవాలిప్రజల భద్రత కోసం నిత్యం విధుల్లో నిమగ్నమయ్యే పోలీసు సిబ్బంది ఆరోగ్య పరిరక్షణపై నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ప్రత్యేక దృష్టి సారించింది.
క్యాన్సర్ను ముందస్తుగా గుర్తించి నివారించడమే లక్ష్యంగా పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో బ్రిడ్జ్ గ్యాప్ హాస్పిటల్, ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్, మేఘనా డెంటల్ హాస్పిటల్, లెజిట్ డయాగ్నొస్టిక్స్ సంస్థల సహకారంతో నిర్వహిస్తున్న ఈ శిబిరాన్ని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..50 ఏళ్లు పూర్తయిన పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు ఈ అవకాశాన్ని తప్పనిసరిగా వినియోగించుకోవాలని సూచించారు. పోలీసు ఉద్యోగం నిరంతర అప్రమత్తత, శారీరక, మానసిక ఒత్తిడితో కూడుకున్నదని, అసమయ భోజనం, నిద్రలేమి, ఒత్తిడి కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముందని సీపీ తెలిపారు.
విధి నిర్వహణలో ఎంత శ్రద్ధ చూపుతారో, ఆరోగ్యంపైనా అంతే శ్రద్ధ చూపాలని సూచించారు. క్యాన్సర్ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే చికిత్స విజయవంతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, అందుకే ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని కోరారు.
ధూమపానం, పొగాకు, గుట్కా, మద్యపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలని, సమతుల్య ఆహారం, నిత్య వ్యాయామం, తగిన విశ్రాంతితో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచించారు. ఆరోగ్యవంతమైన పోలీసు సిబ్బందే ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించగలరని పేర్కొన్నారు.
ఈ శిబిరం ఐదు రోజులపాటు కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఇందులో ఓరల్ చెకప్, చెస్ట్ ఎక్స్రే, ఆర్బీఎస్ పరీక్ష, ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
కార్యక్రమంలో ఏసీపీ ప్రకాశ్ యాదవ్, పోలీస్ యూనిట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సరళ, ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ అమర్ దీపిక, డాక్టర్ పనస అరవింద్, డాక్టర్ కార్తీక్, డాక్టర్ రవీంద్రనాథ్ సారీ, డాక్టర్ ఆదిత్య తేజ, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు ధరణికుమార్, సతీష్, రూరల్ సీఐ శ్రీనివాస్తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
