నిజామాబాద్ పట్టణంలోని న్యాక్ సెంటర్లో మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో, తెలంగాణ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా మైనార్టీ మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ముఖ్య అతిథిగా హాజరై అర్హులైన మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా షబ్బీర్ మాట్లాడుతూ,
రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. స్వయం ఉపాధి ద్వారా మహిళలు తమ కుటుంబాలకు అండగా నిలిచి, గౌరవప్రదమైన జీవనం సాగించాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు.
నిజామాబాద్ జిల్లాలో రూ.1.02 కోట్ల వ్యయంతో మొత్తం 1,700 కుట్టు మిషన్లను పంపిణీ చేస్తున్నామని, అందులో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి చెందిన 500 మంది మహిళలకు కుట్టు మిషన్లు అందించడం సంతోషకరమని తెలిపారు.
ఈ పథకం ద్వారా అనేక కుటుంబాలకు స్థిరమైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి నాయకత్వంలో మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, విద్య, ఉపాధి, స్వయం ఉపాధి, నైపుణ్యాభివృద్ధి వంటి అన్ని రంగాల్లో మైనార్టీల అభ్యున్నతికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.
కుట్టు మిషన్లు పొందిన మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చిన్న పరిశ్రమలుగా అభివృద్ధి చెందాలని, మరికొందరికి కూడా ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని సూచించారు. ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ పథకాన్ని అర్హులైన లబ్ధిదారులకు పారదర్శకంగా చేరేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, నుడా చైర్మన్ కేశ వేణు, రత్నాకర్ , జావిద్ అక్రమ్ , MA పహీం , నయీమ్,
కరీం, పాప ఖాన్, హఫీస్ లయీక్ ఖాన్ , హరూన్ ఖాన్,మైనార్టీ వెల్ఫేర్ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా లబ్ధిదారులు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
