ఇందూరు మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించి, మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడం ఖాయమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు.
గురువారం నగరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి అధ్యక్షతన మున్సిపల్ అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లతో కీలక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..
“మన ఇందూర్ – మన మేయర్” కావాలని నగర ప్రజలు బలంగా కోరుకుంటున్నారని, పోలింగ్ సరళిని గమనిస్తే ప్రజా తీర్పు బీజేపీకే అనుకూలంగా ఉన్నట్లు స్పష్టమవుతోందన్నారు. నగర అభివృద్ధి కేవలం బీజేపీతోనే సాధ్యమని నమ్మిన ప్రజలు కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలను తిరస్కరించారని విమర్శించారు.
ఫలితాల వెల్లడి రోజున ఆ పార్టీలకు భంగపాటు తప్పదని, కార్యకర్తల కష్టానికి తగిన ప్రతిఫలం దక్కబోతోందని పేర్కొన్నారు. శుక్రవారం జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియపై అభ్యర్థులకు, ఏజెంట్లకు ఎమ్మెల్యే పలు సూచనలు చేశారు.
ఏజెంట్లు నిర్ణీత సమయానికి కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవాలి. ఓట్ల బాక్సులను తెరిచే ముందే సీల్స్ సరిగ్గా ఉన్నాయో లేదో క్షుణ్ణంగా పరిశీలించాలి. ప్రతి ఓటును జాగ్రత్తగా గమనించాలి; బీజేపీకి పడిన ఓట్లు ‘ఇన్వాలిడ్’ కాకుండా అప్రమత్తంగా ఉండాలి.
ఏదైనా అనుమానం వస్తే వెంటనే అభ్యంతరం వ్యక్తం చేసి, అవసరమైతే ‘రీ-కౌంటింగ్’ కోరాలి. ప్రతి రౌండ్ పూర్తయిన తర్వాత అధికారిక లెక్కలతో మీ దగ్గరున్న గణాంకాలను సరిచూసుకోవాలనీ సూచించారు. ఈ సమావేశంలో నాయకులు కార్పొరేటర్ అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు పాల్గొన్నారు.
