జగిత్యాల జిల్లాలో బీజేపీ లో సాగుతున్న పంచాయితీ హైదారాబాద్ కు చేరింది. . పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నవారి మీద కఠిన చర్యలు తీసుకోవాలంటూ పార్టీ నేతలు కార్యకర్తలు ఛలో హైదారాబాద్ కు సిద్ధం అవుతున్నారు సుమారు 5 వందల వాహనాలలో బుధవారం హైదరాబాద్ వెళ్ళడానికి కార్యచరణ సిద్ధం చేస్తున్నారు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సురభి నవీన్ కుమార్ , జిల్లా నాయకుడు ముదుగంటి రవీందర్ రెడ్డి , మాజీ జిల్లా అధ్యక్షుడు మోరేపల్లి సత్యనారాయణపై ఇప్పటికే రాష్ట్ర నాయకత్వానికి పలుమార్లు అధికారికంగా ఫిర్యాదులు వెళ్లినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
జగిత్యాల నియోజకవర్గ నాయకురాలు భోగ శ్రావణి ఇంటిపై దాడి ఘటన, నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురికి వ్యతిరేకంగా నిర్వహించినట్లు చెబుతున్న మీడియా సమావేశాలు, అలాగే జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్తో మోరెపల్లి సత్యనారాయణకు ఉన్న సన్నిహిత సంబంధాలు, కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తున్నారనే ఆరోపణలు ప్రధానంగా రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లిన అంశాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.ఇన్ని ఫిర్యాదులు వెళ్లినప్పటికీ ఇప్పటివరకు రాష్ట్ర నాయకత్వం నుంచి ఎలాంటి స్పష్టమైన చర్యలు లేకపోవడంపై పార్టీ కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లు సమాచారం.
మరోవైపు తమ కార్యక్రమాల వెనక కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఉన్నారని సురభి నవీన్ పార్టీ శ్రేణులకు, స్థానిక మీడియాకి బహిరంగంగా వివరించడం మరింత చర్చకు దారి తీసింది.దీంతో ఇక రాష్ట్ర నాయకత్వానికి తమ అసంతృప్తిని నేరుగా తెలియజేయాలని నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని బీజేపీ శ్రేణులు నిర్ణయించినట్లు తెలుస్తోంది.
రేపు సుమారు 500 కార్లతో రాష్ట్ర నాయకత్వాన్ని కలిసి, ఇప్పటికే చేసిన ఫిర్యాదులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు అంటూ అడిగేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నట్లు సమాచారం.పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తల కంటే పార్టీ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులకే ప్రాధాన్యత ఇస్తే క్షేత్రస్థాయిలో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది.
ఫిర్యాదులపై రాష్ట్ర నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? 500 కార్లతో జరగనున్న ఈ కార్యక్రమం తర్వాత బీజేపీలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి? అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
