తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ తరపున రక్తదాన శిబిరం నిర్వహించారు.
ఈ శిబిరాన్ని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ప్రారంభించగా, రెవెన్యూ అసోసియేషన్ ప్రతినిధులతో పాటు వివిధ శాఖలకు చెందిన సుమారు 60 మంది ఉద్యోగులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు.
తలసేమియా పేషెంట్ల కోసం రక్తదాన శిబిరం నిర్వహించడం గొప్ప విషయమని ఈ సందర్భంగా కలెక్టర్ అభినందించారు. అన్ని దానాలలోకెల్లా రక్తదానం ఎంతో గొప్పదని, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారి ప్రాణాలను కాపాడేందుకు ఉపకరిస్తుందని గుర్తు చేశారు.
హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ నెలకొల్పి, రెవెన్యూ ఉద్యోగుల సంఘం ద్వారా ప్రతీ ఏటా ఈ తరహా సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తుండడం ముదావహమని, ఇదే స్ఫూర్తితో మునుముందు మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
రక్తదానం చేసిన ఉద్యోగులకు రెవెన్యూ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరపున ప్రశంసా పత్రాలు అందజేశారు. రెడ్ క్రాస్ సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, నిజామాబాద్, ఆర్మూర్ ఆర్డీఓలు రాజేంద్ర కుమార్, రాజాగౌడ్, రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రమణ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ప్రశాంత్, ప్రభు, అసోసియేషన్ ప్రతినిధులు మహేష్, శ్రీనివాస్, తహసీల్దార్ సత్తయ్య రెడ్డి, రెడ్ క్రాస్ బాధ్యులు బుస్స ఆంజనేయులు, తోట రాజశేఖర్, తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
