గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక నిఘా కొనసాగించాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అధికారులను ఆదేశించారు.
ఈ మేరకు గురువారం ఆయన జిల్లా పోలీస్ అధికారులు , ఎస్ హెచ్ ఓ లతో సెట్ కాన్ఫరెన్స్ లో పాల్గొని, ఎన్నికల భద్రత , శాంతి భద్రతా చర్యలు , పర్యవేక్షణకు సంబంధించిన సూచనలు , సలహాలు తెలియజేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా గ్రామపంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది అప్రమత్తతతో విధులు నిర్వహించాలని సూచించారు.
జిల్లాలో ఎన్నికల నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని , ఎన్నికలలో ఓటర్లను ప్రభావితం చేయడానికి అక్రమంగా డబ్బు , మద్యం లేదా ఇతర పదార్థాలు రాకుండా చెక్పోస్టుల వద్ద ఇతర శాఖల సమన్వయంతో తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.
విజిబుల్ పోలిసింగ్ , నాకబందీలు , ఆకస్మిక తనిఖీలు నిరంతరం జరగాలని తెలిపారు. ఎస్.హెచ్.ఓలు , వీ.పీ.వోలు ప్రతి గ్రామాన్ని సందర్శించి పోలింగ్ కేంద్రాలను పరిశీలించడంతో పాటు గ్రామాల్లో పెట్రోలింగ్ను మరింత బలోపేతం చేయాలని సూచించారు.
సమస్యత్మక ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాలని అన్నారు. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు, ఇతరుల భావోద్వేగాలను దెబ్బతీసే విధమైన చర్యలపై ప్రత్యేక నిఘా ఉంచాలని పేర్కొన్నారు. ప్రతీ సిబ్బంది ముందస్తు సమాచారం సేకరించాలని, అట్టి సమాచారం ఎప్పటి కప్పుడు తమ పై అధికారులకు తెలియజేయని అన్నారు.
అలాగే లాడ్జీలు, గెస్ట్ హౌసులు , కమ్యూనిటీ హాలులు , ఫంక్షన్ హాలుల్లో నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ, అనుమానితుల కదలికలను పర్యవేక్షించాలన్నారు. ఎన్నికలకు సంబంధించిన అంశాల్లో, రాజకీయ కార్యకలాపాల్లో పోలీస్ సిబ్బంది ఎలాంటి ప్రమేయం ఉండకూడదని హెచ్చరించారు.
విధుల్లో నిర్లక్ష్యం లేదా నిబంధనల ఉల్లంఘన చోటుచేసుకుంటే శాఖాపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో వివాదాస్పద కేసుల్లో, అలాగే ఇతర కేసుల్లో నమోదైన రౌడీషీటర్లను బైండోవర్ చేసి వారికి కౌన్సిలింగ్ నిర్వహించాలని సూచించారు.
నేటి నుంచి ప్రారంభమయ్యే నామినేషన్ ప్రక్రియ సందర్భంగా నామినేషన్ కేంద్రాల వద్ద పకడ్బందీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
నామినేషన్ సమయంలో అనవసర గుమికూడేలా అనుమతించకూడదని, వాహనాలు, అనుచరుల సంఖ్య నియమాల పరిధిలో ఉండేలా చూసుకోవాలని , కేంద్రం లోపల, బయట సీసీటీవీ పర్యవేక్షణ తప్పనిసరి చేయాలని స్పష్టం చేశారు.
అభ్యర్థుల మధ్య ఘర్షణలు, వాగ్వాదాలు రాకుండా పోలీసులు ముందుగానే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సెట్ కాన్ఫరెన్స్లో పోలీస్ కమీషనర్ గారితో పాటు అదనపు డి. సి. పి బస్వా రెడ్డి , స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రమేష్ , ఎలక్షన్స్ సెల్ ఇన్స్పెక్టర్ వీరయ్య తదితరులు పాల్గొన్నారు.
