నగరంలోని వాహనాల తనిఖీలో పోలీసులు గంజాయిని పట్టుకున్నారు. ఈ సంఘటన నగరంలోని ఒకటవ టౌన్ పరిధిలో చోటుచేసుకుంది. ఒకటవ టౌన్ ఎస్హెచ్ఓ రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం..
నగరంలో ఈ రద్దీ కూడలి అయిన నిఖిల్ సాయి చౌరస్తా వద్ద ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో అటుగా దూసుకువచ్చిన ఓ కారును సిబ్బంది నిలువరించారు. కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు మహారాష్ట్రకు చెందినవారిగా గుర్తించారు.
వారంతా తీవ్రంగా మద్యం సేవించి ఉండటాన్ని గమనించిన పోలీసులు, వెంటనే డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష కోసం బ్రీత్ అనలైజర్ తీసుకురావాలని కోరారు.
పోలీసుల సూచన మేరకు సహకరించాల్సింది పోయి, ఆ ముగ్గురు వ్యక్తులు అడ్డంగా తిరగబడ్డారు. తనిఖీలకు ఏమాత్రం సహకరించకుండా, విధుల్లో ఉన్న ట్రాఫిక్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. మద్యం మత్తులో ఆ ముఠా అరాచకం సృష్టించడంతో చౌరస్తాలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది.
ముగ్గురు వ్యక్తుల అనుచిత ప్రవర్తన, వారి దాష్టీకంపై అనుమానం పెంచుకున్న పోలీసులు, వారి కారును క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆ తనిఖీల్లో పోలీసులకు కారులో రహస్యంగా దాచిన మూడు గ్రాముల గంజాయి పట్టుబడిందనీ తెలిపారు.
తాగి వాహనం నడుపుతూ, అక్రమంగా గంజాయిని రవాణా చేస్తున్న వీరి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్ఓ రఘుపతి తెలిపారు.
