జిల్లా గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడత ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి అపూర్వ విజయాన్ని తెచ్చిపెట్టాయి. పదేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం, పల్లెల్లో ‘హస్తం’ సృష్టించిన విజయ దుందుభి… జిల్లా రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికింది.
మొదటి విడతలో సాధించిన విజయాలకు గట్టి కొనసాగింపుగా, రెండో విడత ఎన్నికల్లోనూ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే అధిక సంఖ్యలో గెలుపొందారు. ముఖ్యంగా, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏకఛత్రాధిపత్యం ప్రదర్శించి, బీఆర్ఎస్ (BRS) పార్టీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.
రెండో విడతలో ఎన్నికలు జరిగిన నిజామాబాద్ సబ్ డివిజన్ పరిధిలోని కీలక మండలాలు జక్రాన్పల్లి, డిచ్ పల్లి, ఇందల్వాయి, సిరికొండ పూర్తిగా కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది.
ఈ నాలుగు మండలాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఆ పార్టీ అభ్యర్థులు అపూర్వ విజయాన్ని సాధించి, తమ పూర్వ వైభవాన్ని చాటుకున్నారు.ఈ కీలక పీఠాలన్నీ హస్తం పార్టీ వశం కావడం ప్రస్తుత రాజకీయ పరిణామాలకు నిదర్శనం.రెండో విడత ఎన్నికల కోసం మొత్తం 196 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ వెలువడగా, ఏకగ్రీవాల సంఖ్య గతం కంటే మెరుగ్గా 38కి చేరింది.
మిగిలిన 158 గ్రామ పంచాయతీలకు గురువారం పోలింగ్ ప్రక్రియ నిర్వహించారు. ఓటర్లు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఈసారి భారీగా పోలింగ్ శాతం నమోదైంది.
ఈ భారీ పోలింగ్ ప్రజా తీర్పు పూర్తిగా కాంగ్రెస్ వైపే ఉందనే విషయాన్ని స్పష్టం చేసింది. ధర్పల్లీ… చెలిమేల శ్రీనివాస్.కాంగ్రెస్, ఇందల్వాయి….లోకాని గంగమణి.. ఇండిపెండెంట్ అభ్యర్థి , జక్రాన్పల్లి…బండి పద్మ సత్యం..కాంగ్రెస్, మాక్లూర్..వెంకటేశ్వర రావు…కాంగ్రెస్, మోపాల్… రవి..బిజెపి, సిరికొండ.. మల్లెల సాయి చరణ్.. బీఆర్ఎస్, డిచ్ పల్లి లో లక్కోరి గిరి లు విజయాలు సాధించారు.
బీఆర్ఎస్ వ్యూహాలు విఫలం..జిల్లా గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడత ఫలితాలు బీఆర్ఎస్ పార్టీని సమూలంగా కుదిపేశాయి. రూరల్ నియోజకవర్గంలో పదేళ్లుగా తిరుగులేని అధికారాన్ని చలాయించిన పాలక పక్షానికి పల్లె ప్రజలు ఊహించని రీతిలో భారీ షాక్ ఇచ్చారు.
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని కీలకమైన జక్రాన్పల్లి, డిచ్ పల్లి, ఇందల్వాయి, సిరికొండ మండలాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు సృష్టించిన సునామీ… రాజకీయ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది.ఈ పరాజయంపై బీఆర్ఎస్ వర్గాల్లో తీవ్ర అంతర్మథనం ప్రారంభమైనట్లు తెలుస్తోంది.
