నెల రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు..
జిల్లాలో రహదారి ప్రమాదాల సంఖ్యను గణనీయంగా తగ్గించి, “ప్రమాదాల రహిత జిల్లా”గా తీర్చిదిద్దడమే తమ ప్రధాన లక్ష్యమనినిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పేర్కొన్నారు.
జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా జిల్లా రోడ్డు సేఫ్టీ కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన అవగాహన కరపత్రాలను జిల్లా రవాణా అధికారిణి జి.దుర్గా ప్రమీలతో కలిసి గురువారం ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాహనదారులు రోడ్డు నిబంధనల పట్ల అవగాహన కలిగి ఉండాలని, నిర్లక్ష్యం వల్ల జరిగే ప్రమాదాలు కుటుంబాలను రోడ్డున పడేస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. జనవరి 1 నుంచి 31 వరకు నెల రోజుల పాటు జిల్లావ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, కూడళ్ల వద్ద ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు.
మద్యం సేవించి వాహనాలు నడపరాదని, మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని సూచించారు.రవాణా శాఖ, పోలీస్ యంత్రాంగం సమన్వయంతో ప్రమాదాల నివారణకు కృషి చేస్తున్నామని డీటీవో దుర్గా ప్రమీల తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీలు బస్వరెడ్డి, రామ్ చందర్ రావు,, ఆర్టీఓ ఉమామహేశ్వరరావు, మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ బి. శ్రీనివాస్, కిరణ్ కుమార్, నాగలక్ష్మి, అజయ్ కుమార్ రెడ్డి, అలాగే ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ ఏసీపీలు, ట్రాఫిక్ సీఐ పి. ప్రసాద్, రెడ్ క్రాస్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
