గతేడాది కంటే 33 శాతం అదనం.. పెరిగిన ‘మందు’ బాబుల తాకిడి..జిల్లాలో నూతన సంవత్సర వేడుకలు కిక్కునిచ్చాయి. పాత ఏడాదికి వీడ్కోలు చెబుతూ.. కొత్త ఏడాదికి స్వాగతం పలికే క్రమంలో మందుబాబులు కుంభ వృష్టి కురిపించారు.
జిల్లా వ్యాప్తంగా మద్యం ఏరులై పారింది. ప్రభుత్వం అమ్మకాల సమయాన్ని సడలించడంతో, మందుప్రియులు వైన్ షాపుల ముందు క్యూ కట్టారు. ఫలితంగా అబ్కారీ శాఖకు కాసుల వర్షం కురిసింది. డిసెంబర్ 31 ఒక్కరోజే జిల్లాలో రికార్డు స్థాయిలో రూ. 17 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరగడం విశేషం.
గడ్డకట్టే చలిని లెక్కచేయకుండా యువత, పలు వర్గాల ప్రజలు వేడుకల్లో మునిగిపోయారు. గతేడాదితో పోలిస్తే ఈసారి విక్రయాలు ఏకంగా 33 శాతం పెరిగాయి. ప్రభుత్వం బార్లు, వైన్ షాపులకు వెసులుబాటు కల్పించడంతో అర్ధరాత్రి వరకు విక్రయాలు జోరుగా సాగాయి. కుర్రకారు బీర్ల బాటిళ్లతో కేరింతలు కొట్టగా, పెద్దలు లిక్కర్ బాటిళ్లతో ఎంజాయ్ చేశారు.
అబ్కారీ శాఖ లెక్కల ప్రకారం.. ఒక్కరోజే 15,000 కేసుల లిక్కర్, 14,000 కేసుల బీర్లు విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు. మద్యం ధరలు పెరిగినా తాగేవారి సంఖ్య ఏమాత్రం తగ్గలేదు.
అదనపు సమయం, పెరిగిన ధరలు వెరసి సర్కారు ఖజానాకు భారీగా ఆదాయం చేకూరింది. స్నేహితుల కలయిక, పార్టీల సందడితో జిల్లాలోని ప్రధాన కూడళ్లన్నీ మద్యం మత్తులో ఊగిపోయాయి.
