HomeLaw and Orderరోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం ప్రజల్లో అవగాహన పెంపొందించాలి... కలెక్టర్ ఇలా త్రిపాఠి

రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం ప్రజల్లో అవగాహన పెంపొందించాలి… కలెక్టర్ ఇలా త్రిపాఠి

రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు.

ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను విధిగా పాటిస్తూ, ప్రమాదాల బారిన పడకుండా స్వీయ జాగ్రత్తలు పాటించేలా చూడాలన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో సోమవారం కలెక్టర్ అధ్యక్షతన అధికారులకు, సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన పలు వీడియోలను ప్రదర్శిస్తూ, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా రవాణా శాఖ అధికారి ఉమా మహేశ్వర్ రావు అవగాహన కల్పించారు. జిల్లాలో 2024 సంవత్సరంలో 856 ప్రమాదాలు చోటుచేసుకుని 351 మంది మృతి చెందగా, 2025 నవంబర్ మాసాంతానికి 815 రోడ్డు దుర్ఘటనల్లో 280 మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు.

ముఖ్యంగా అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాల బారిన పడుతున్నారని, ఎక్కువగా ద్విచక్రవాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని అన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో, సమిష్టిగా కృషి చేయాలన్నారు. ఈ నెలాఖరు వరకు కొనసాగనున్న జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను పూర్తి స్థాయిలో విజయవంతం చేసేలా కార్యక్రమాలు అమలు చేయాలన్నారు.

అతి వేగం, తాగి వాహనాలు నడపడం, సీట్ బెల్ట్, హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడపడం వల్ల కలిగే అనర్ధాలను తెలియజేస్తూ విద్యార్థులకు, వాహన డ్రైవర్లకు, ప్రజలకు అవగాహన పెంపొందేలా విరివిగా ప్రచారం నిర్వహించాలని అన్నారు. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలలలో విద్యార్థులకు రోడ్డు భద్రతా నిబంధనలపై అవగాహన కల్పించాలని సూచించారు.

ప్రమాదాల తీవ్రతను నిలువరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, తద్వారా ఎన్నో విలువైన నిండు ప్రాణాలను కాపాడగల్గుతామని అన్నారు. అధికారులు అంకితభావంతో కృషి చేస్తూ నిజామాబాద్ ను ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియా, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావి, జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, హౌసింగ్ పీ.డీ పవన్ కుమార్, ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, ఎం.వీ.ఐ కిరణ్ కుమార్, హర్ష తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments