మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరో గా జాన్వీ హీరోయిన్ గా బుచ్చిబాబు సాన తెరకెక్కించిన రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ ఇవాళ గురువారం జూన్ 4,న ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది , కన్నడ స్టార్ శివ రాజ్కుమార్, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు గ్రాండ్ గా నిర్మించారు.
ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. అర్ద రాత్రి నుంచే మెగా అభిమానులు సందడి మొదలయింది. తెల్లవారు జామున నుంచే షో లు మొదలు అయ్యాయి. ముఖ్యంగా యువత పెద్ది మానియా తో ఊగిపోయారు.
///////// సినిమా కథ ఇదే ///////
గ్రామీణ క్రీడా ఛాలెంజ్ నేపథ్యంలో ఈ సినిమా ను తెరకెక్కించారు విజయనగరానికి సమీపంలోని కొండ కింద ఊరికి చెందిన పెద్ది (రామ్ చరణ్). ఆ ఊరికి వెళ్లాలంటే కాలి నడకన కొండలు, వాగులు దాటడం తప్ప ఎలాంటి రవాణా సౌకర్యం ఉండదు.
పక్కనే రైల్వే ట్రాక్ ఉన్నా ఆ ఊరికి పేరు, ఎలాంటి గుర్తింపు లేదు కనుక రైలు అక్కడ ఆగదు. అక్కడ ఎవరికి ఓటు హక్కు లేకపోవడంతో ప్రభుత్వం, రాజకీయ నేతలు వాళ్లను పట్టించుకోరు. విజయనగరం బెల్లం బట్టీలలో పని చేస్తూ వచ్చే అరాకొర కూలీతో అక్కడి వాళ్లంతా జీవనం సాగిస్తుంటారు.
పెద్ది ఆ పనితో పాటు ఆట కూలీగా క్రికెట్ ఆడుతుంటాడు. ఏ ఊరి ప్రజలు ఎక్కువ డబ్బులకు పాడుకుంటే ఆ ఊరి తరఫున క్రికెట్ ఆడుతూ, తనదైన ఆట తీరుతో ఆ ప్రాంతంలో చక్కని గుర్తింపు తెచ్చుకుంటాడు. లోకల్ పొలిటీషియన్ (రావు రమేష్) కూతురు అచ్చియమ్మ (జాన్వీ కపూర్) ను ప్రేమిస్తుంటాడు.
ఆమె కారణంగా రామ్ బుజ్జి (దివ్యేందు శర్మ)తో గొడవ పడతాడు. అక్కడే క్రికెట్ ఆటలో పెద్దిని అవమానించి తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తారు. మరోవైపు రైల్వే స్టేషన్ తోనే తమ ఊరికి గుర్తింపు వస్తుందని 30 ఏళ్లుగా పోరాటం చేస్తున్న అప్పలసూరి (జగపతి బాబు) చేసిన త్యాగం, తదనంతర పరిస్థితులు పెద్దిలో మార్పు తీసుకొస్తాయి.
ఆ మార్పు ఏమిటి..? ఎంతో ఇష్టమైన క్రికెట్ను వదిలి గౌర్నాయుడు ( శివ రాజ్ కుమార్) దగ్గర కుస్తీ ఎందుకు నేర్చుకున్నాడు..? రెజ్లింగ్ లో నేషనల్స్ వరకు వెళ్లిన పెద్దికి ఎదురైన అడ్డంకులు ఏంటి..? కుస్తీ నుంచి మరో ఆటకు ఎందుకు మారాల్సి వచ్చింది..? అందుకోసం అతను చేసిన త్యాగం ఏమిటి.. తన ఊరికి గుర్తింపును, రైల్వే స్టేషన్ను ఎలా తీసుకు వచ్చాడు..? అనేది అసలు కథ.ఎలా ఉందంటే..? సింగిల్ లైన్గా చెప్పాలంటే ‘‘ప్రపంచం గెలిచిన వాడి మాటే వింటుంది.. తన గెలుపుతో ఊరికి గుర్తింపు తీసుకురావాలి..” అనేది ‘పెద్ది’ స్టోరీ ఇది. మనిషికి గుర్తింపు అనేది ఆత్మ గౌరవం.
కానీ ఒక ఊరికే గుర్తింపు లేకపోతే..! ప్రభుత్వ రికార్డుల్లో లేని తన ఊరి ఆత్మగౌరవం కోసం విజయనగరం నుంచి ఢిల్లీ వరకు ఓ క్రీడాకారుడు చేసిన స్ఫూర్తిదాయక ప్రయాణం ఈ సినిమా. క్రికెట్, కుస్తీ నేపథ్యంలో వచ్చే సీన్స్ సినిమాకు మేజర్ హైలైట్గా నిలిచాయి. ముఖ్యంగా ఇద్దరు రెజ్లర్స్తో పెద్ది ఒకేసారి పోరాడే సీన్లో హీరోయిజాన్నిఎలివేట్ చేసిన తీరు కిక్ ఇస్తుంది.
అయితే ఫస్ట్ హాఫ్లోని కొన్ని సీన్స్ సినిమాకు పెద్ద మైనస్. విజయ నగరం నేపథ్యంలో వచ్చే సీన్స్ మెయిన్ స్టోరీలైన్కు సంబంధం లేకుండా విసిగిస్తాయి. హీరోహీరోయిన్ల లవ్ ట్రాక్ కూడా అంతగా కనెక్ట్ అవదు. బలవంతంగా ఇరికించిన భావన కలుగుతుంది.అప్పలసూరి ప్రాణత్యాగం, తన బాడీ కోసం రైల్వే పోలీసులతో పెద్ది ఫైట్ చేసే సీన్స్తో అసలు స్టోరీ ట్రాక్ ఎక్కుతుంది.
సెకండాఫ్లో వచ్చే సీన్స్, ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ను రాసుకున్న తీరు ఇంప్రెస్ చేస్తుంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాకు భిన్నంగా ఆ సీన్స్ తీర్చిదిద్దారు. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో చాలా సినిమాలు వచ్చాయి. కానీ ఇలా క్రాస్ ఓవర్ అథ్లెట్ స్టోరీతో సినిమా రావడం ఈ సినిమాకు ప్లస్ అయింది.
కానీ అదే కొంత మైనస్ కూడా. రెండో ఆటకు మూడో ఆటకు మధ్య ట్రాన్సిషన్ సరిగా కుదరలేదు. ఆ సీన్స్ కొంత హడావుడిగా ముగిసినట్టు అనిపిస్తాయి. రామ్ చరణ్ క్యారెక్టర్, నటన మీద ఎక్కువ ఫోకస్ పెట్టిన దర్శకుడు… జగపతిబాబు, శివరాజ్ కుమార్ మినహా మిగతా పాత్రలను అంతగా పట్టించుకోలేదు.
ముఖ్యంగా ఒక ఊరి కోసం వ్యక్తి చేసే పోరాటంలో ఆ ఊరు, అక్కడి భావోద్వేగాలు కనిపించాలి. అప్పలసూరి, పెద్ది పాత్రలకే ఆ పోరాటాన్ని పరిమితం చేశారు.
