జిల్లా పాలనా యంత్రాంగానికి గుండెకాయ వంటి కలెక్టరేట్ సముదాయంలోనే ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. సాక్షాత్తూ జిల్లా పరిశ్రమల శాఖ కార్యాలయానికి శనివారం ఉదయం 11 గంటలైనా తాళం వేసి ఉండటం అధికారుల బాధ్యతారాహిత్యానికి అద్దం పడుతోంది.
కార్యాలయ సమయం దాటి గంటలు గడుస్తున్నా, ఏ ఒక్క అధికారి గానీ, సిబ్బంది గానీ అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పరిశ్రమల స్థాపన, రాయితీలు, ఇతర పనుల నిమిత్తం జిల్లా నలుమూలల నుంచి వచ్చిన నిరుద్యోగులు, పారిశ్రామికవేత్తలు కార్యాలయం వద్ద పడిగాపులు కాస్తున్నారు.
ఉదయం 10:30 గంటలకే కార్యాలయానికి చేరుకున్న సందర్శకులకు మూసి ఉన్న తలుపులు దర్శనమిచ్చాయి. 11 గంటలు దాటినా తాళాలు తీసే నాథుడే లేకపోవడంతో, “ఇది ప్రభుత్వ కార్యాలయమా లేక ప్రైవేటు సంస్థా?” అంటూ సందర్శకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టరేట్ ఆవరణలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే, క్షేత్రస్థాయిలో పరిస్థితి మరెంత దారుణంగా ఉంటుందోనని జనం చర్చించుకుంటున్నారు.
సుదూర ప్రాంతాల నుంచి ఖర్చు పెట్టుకుని వస్తే, అధికారుల గైర్హాజరీతో పనులు కాక వెనుదిరగాల్సి వస్తోందని బాధితులు మండిపడుతున్నారు. ప్రభుత్వ పనివేళలను పాటించడంలో ఇంతటి నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న సిబ్బందిపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
బయోమెట్రిక్ హాజరు, పర్యవేక్షణ ఉన్నా.. కార్యాలయానికి తాళం వేసి ఉండటం జిల్లా యంత్రాంగం పనితీరుకు మాయని మచ్చగా మారింది.
