నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ శాఖలో తీవ్ర కలకలం రేగింది. స్థానిక ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ (సీఐ) స్వప్న వ్యవహారశైలికి నిరసనగా కానిస్టేబుళ్లు శనివారం జిల్లా కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయం ఎదుట బైఠాయించి నినాదాలు చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
విధుల్లో తమకు రక్షణ కరువైందని మహిళా కానిస్టేబుళ్లు కన్నీటిపర్యంతమయ్యారు.ఈ సందర్భంగా నిరసన తెలుపుతున్న కానిస్టేబుళ్లు సీఐ స్వప్నపై సంచలన ఆరోపణలు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..అమీద్ అనే వ్యక్తితో చేతులు కలిపి, ఇతర జిల్లాలకు చెందిన గంజాయి స్మగ్లర్లతో ఆమె కుమ్మక్కయ్యారని ధ్వజమెత్తారు. పక్కా ప్రణాళికతో ఇతర ప్రాంతాల నుంచి గంజాయిని నిజామాబాద్కు అక్రమంగా తరలించి, ఇక్కడ పట్టుకున్నట్లుగా చూపిస్తూ బోగస్ కేసులు నమోదు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కేవలం తమ పరపతి పెంచుకోవడానికే ఇటువంటి అక్రమాలకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. శుక్రవారం జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ సౌమ్య పరిస్థితి ప్రస్తుతం అత్యంత విషమంగా ఉందని సహచర సిబ్బంది కన్నీరు మునిరయ్యారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో వెంటిలేటర్పై మృత్యువుతో పోరాడుతోందని వారు పేర్కొన్నారు.
సీఐ ఒత్తిడితో కూడిన విధులే ఇటువంటి ప్రమాదాలకు కారణమవుతున్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ గంజాయి వ్యాపారులతో సంబంధాలు కలిగి ఉన్న సీఐని వెంటనే విధుల నుంచి తొలగించాలి. బోగస్ కేసుల వ్యవహారంపై ఉన్నతాధికారులు లోతైన విచారణ జరిపించాలి.
ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న కానిస్టేబుళ్లకు ఉన్నతాధికారుల నుంచి వేధింపులు లేకుండా చూడాలి. మేము ప్రాణాలకు తెగించి పనిచేస్తుంటే, ఉన్నతాధికారులే స్మగ్లర్లతో చేతులు కలపడం అన్యాయం. మాకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపం” అని నిరసనకారులు స్పష్టం చేశారు.
