అధికార దాహంతో కార్పొరేటర్లను ఎత్తుకుపోయే నీచ సంస్కృతికి ఆ పార్టీ తెరలేపిందని ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు.శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.నగర ప్రజలు బీజేపీకి బ్రహ్మాండమైన విజయాన్ని అందించారని, 40 శాతానికి పైగా మైనార్టీలు ఉన్నప్పటికీ తమ పార్టీ 28 స్థానాల్లో విజయం సాధించడం హర్షణీయమన్నారు.
పదవుల కోసం కాంగ్రెస్ నాయకులు తమ ఆత్మాభిమానాన్ని చంపుకుంటున్నారని ధ్వజమెత్తారు.గతంలో అక్బరుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్ను తీవ్రంగా దూషించినా, ఇప్పుడు అదే వారితో చేతులు కలపాలని చూడటం సిగ్గుచేటని మండిపడ్డారు. కాంగ్రెస్ను ఒక ‘బ్రోకర్’ పార్టీగా ఆయన ఆరోపించారు.
ఈ ఐదేళ్ల పదవీకాలం ముగిసేలోపు నిజామాబాద్ పేరును ఇందూరు గా మార్చడం తథ్యమని స్పష్టం చేశారు. “మేము తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తాం. రాబోయేది మా ప్రభుత్వమే, అప్పుడు అధికారికంగా పేరు మారుస్తాం” అని ధీమా వ్యక్తం చేశారు.
మున్సిపల్ ఎన్నికల అనంతరం చోటుచేసుకుంటున్న పరిణామాలపై స్పందిస్తూ.. బీఆర్ఎస్ అభ్యర్థి ఇంటి వద్ద పోలీసుల పహారా ఏంటి? ఏకంగా నలుగురు ఎస్సైలు కాపలా కాయడం సిగ్గుచేటు.”కాంగ్రెస్కు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని, అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ‘ఓటుకు నోటు’ కేసును పక్కనపెట్టి ఇతర అంశాలపై దృష్టి పెట్టడం ఏంటని ప్రశ్నించారు.
నిజామాబాద్ కార్పొరేషన్లో తాము బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని ఎంపీ స్పష్టం చేశారు. కాంగ్రెస్, ఎంఐఎంలు ఒక్కటేనని తాము ముందే చెప్పామని గుర్తు చేశారు. ఎక్స్ అఫీషియో ఓట్లపై మధ్యాహ్నం చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
కొద్దిపాటి మెజార్టీతో 3-4 సీట్లు కోల్పోవడం దురదృష్టకరమని, అయితే ఆర్మూర్ ఫలితాలపై లోతైన విశ్లేషణ చేసి భవిష్యత్తులో పుంజుకుంటామని తెలిపారు. పార్టీలో కోవర్టులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోనని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి,అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
