నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, సరదాగా మొదలయ్యే అలవాటు.. జీవితాలను చిన్నాభిన్నం చేసే వ్యసనంగా మారకూడదని, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఉన్నత లక్ష్యాలను సాధించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పిలుపునిచ్చారు.
శనివారం బోధన్లోని ఓ ఫంక్షన్ హాల్లో ‘నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్’ ఆధ్వర్యంలో యువతకు నిర్వహించిన భారీ అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
మాదకద్రవ్యాల వాడకం కేవలం ఒక వ్యక్తికే కాకుండా, ఆ కుటుంబానికి, తద్వారా సమాజానికి తీరని నష్టం కలిగిస్తుందని సీపీ ఆందోళన వ్యక్తం చేశారు. స్నేహితుల ప్రలోభాలకు లోనై చేసే చిన్న పొరపాటు కెరీర్ను, భవిష్యత్తును నాశనం చేస్తుందని హెచ్చరించారు. డ్రగ్స్ వల్ల కలిగే శారీరక, మానసిక అనర్థాలను ‘పవర్ పాయింట్ ప్రెసెంటేషన్’ ద్వారా విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు.
మత్తులో చేసే నేరాలు జీవితాంతం జైలు పాలు చేస్తాయని, చట్టపరమైన చర్యలు కఠినంగా ఉంటాయని స్పష్టం చేశారు. పిల్లల ప్రవర్తనలో మార్పులను గమనిస్తూ, వారికి సరైన సమయంలో దిశానిర్దేశం చేయాలని కోరారు. ఎక్కడైనా అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1098 కి సమాచారం అందించాలని సూచించారు.
బహుముఖ అవగాహన: ఈ సదస్సులో నార్కోటిక్స్ కట్టడితో పాటు సైబర్ సెక్యూరిటీ, మహిళల భద్రత అంశాలపై కూడా విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సుమారు 1500 మంది కళాశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ జనరల్ సెక్రెటరీ కవితా రెడ్డి, ట్రెజరర్ కేతం సంతోష్, జాయింట్ సెక్రెటరీలు దుష్వంత్, డా. శిరీష్, హితిన్ భీమాని, డా. ఉషారాణి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కొడాలి కిషోర్, సాంబిరెడ్డిలతో పాటు బోధన ఏసీపీ శ్రీనివాస్, పలువురు సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు
