దళితులు క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీలుగా వర్తించరని సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం దళితులకు అన్యాయం చేయడమేనని క్రైస్తవ హక్కుల రక్షణ సమితి అష్ట అధ్యక్షుడు డాక్టర్ అశోక్, క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శి మాణిక్యాల శ్రీనివాస్ చెప్పారు.
ఆర్మూర్ ప్రెస్ క్లబ్ భవనంలో బుధవారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. దళితులు క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సి హోదా రద్దు చేయడం పై సుప్రీంకోర్టు పునఃసమీక్షించాలని కోరారు. మతం వేరు కులం వేరు అని ఈ రెండింటిని వేరువేరుగా చూడాలన్నారు.
క్రైస్తవ మతంలోకి మారితే దళితులకు ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టడం వర్తించదని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం వలన అణగారిన దళితులకు అన్యాయం జరిగినట్లని పేర్కొన్నారు. హిందువులలోని ఇతర కులస్తులు క్రైస్తవ మతంలోకి మారిన బీసీలుగానే పరిగణలోకి తీసుకుంటారని చెప్పారు. దళితులు మతం మారితేనే ఎస్సి హోదా పోతుందా అని వారు ప్రశ్నించారు.
సుప్రీంకోర్టు తీర్పు మత స్వేచ్ఛను, ప్రాథమిక హక్కులను కాలరాస్తుందని చెప్పారు. దళితులు కాకుండా ఇతరులు క్రైస్తవులుగా మారితే రిజర్వేషన్లు వర్తిస్తున్నాయని చెప్పారు. మతం, కులాలు వేరు కాబట్టి దళిత క్రైస్తవులకు ఎస్సీ చట్టాలను వర్తింపజేయాలన్నారు. సుప్రీంకోర్టు దళిత క్రైస్తవులకు ఇచ్చిన తీర్పును తొలగించాలని ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు.
రైతు కూలి సంఘం రాష్ట్ర కార్యదర్శి బి దేవరాం, ప్రజాస్వామ్య పరిరక్షణ కమిటీ మండల చైర్మన్ మూగ ప్రభాకర్ మాట్లాడుతూ దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లను తొలగిస్తామనడం సమంజసం కాదన్నారు. అగ్రవర్ణాలకు సైతం రిజర్వేషన్లు అమలు చేస్తూ అణగారిన వారిని రిజర్వేషన్లు తొలగిస్తే సమిష్టిగా ఉండి ఉద్యమిస్తామన్నారు.
దళిత క్రైస్తవులపై ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం పునః సమీక్షించాలని వారు కోరారు. ఈ సమావేశంలో ఆర్మూర్ క్రైస్తవ అసోసియేషన్ మండల అధ్యక్షులు జాన రమేష్, మండల ప్రధాన కార్యదర్శి పాస్టర్ రాజ్ పాల్ దినకర్, పాస్టర్ ప్రకాష్, పాస్టర్ ఆగస్టిన్ పాల్గొన్నారు.
