మటన్ షాపు ముసుగులో అక్రమ దందా సీపీ సాయి చైతన్య ఆదేశాలతో మెరుపు దాడులుజిల్లాలో నిషేధిత గుట్కా వ్యాపారుల గుండెల్లో ‘చీత ఫోర్స్’ వణుకు పుట్టించింది.
అక్రమంగా గుట్కా నిల్వలు ఉంచి అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. శనివారం బోధన్ మండలం ఆచన్పల్లిలో నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో భారీ ఎత్తున గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్యకు అందిన పక్కా సమాచారంతో సీసీఎస్ ఏసీపీ (ఇంచార్జ్) మస్తాన్ అలీ బృందం రంగంలోకి దిగింది. ఆచన్పల్లిలోని హెచ్ కేజిఎన్ షాప్ డంప్ తో పాటు, ఎవరూ ఊహించని విధంగా మటన్ షాప్లో నిల్వ ఉంచిన గుట్కా సంచులను చూసి అధికారులు సైతం విస్తుపోయారు.
ఈ దాడుల్లో సుమారు రూ. 30 లక్షలవిలువైన అక్రమ సరుకును సీజ్ చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్న గుట్కా, పొగాకు ఉత్పత్తుల సరఫరా చైన్ను కట్ చేస్తామని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు. జిల్లాలో నిషేధిత ఉత్పత్తుల రవాణా, విక్రయాలపై నిరంతరం నిఘా ఉంటుంది.
అక్రమ వ్యాపారులపై పీడీ యాక్ట్ ప్రయోగించడానికి కూడా వెనకాడమని హెచ్చరించారు. పట్టుబడిన సరుకును తదుపరి చట్టపరమైన విచారణ కోసం బోధన్ ఎస్.హెచ్.ఓకు అప్పగించారు. ఈ ముఠా వెనుక ఉన్న సూత్రధారుల కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు.
