ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించనున్న ‘చలో పరేడ్ గ్రౌండ్’ బహిరంగ సభకు జిల్లా నుంచి భాజపా శ్రేణులు సమరోత్సాహంతో కదంతొక్కుతున్నాయి.భారీ జన సమీకరణే లక్ష్యంగా పార్టీ జిల్లా నాయకత్వం క్షేత్రస్థాయిలో సన్నాహాలు పూర్తి చేసింది.ఈ సభకు జిల్లా ప్రజలను తరలించేందుకు ఎంపి ధర్మపురి అరవింద్, జిల్లా ఇన్ఛార్జ్ సైదిరెడ్డి ఆధ్వర్యంలో జిల్లాలోని ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షుడు, ముఖ్య నేతలు శ్రేణులను సమాయత్తం చేశారు.
ప్రతి నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున జనాన్ని తరలించేలా ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, పార్టీ అధ్యక్షులు బాధ్యతలు తీసుకున్నారు.సుమారు 150 ఆర్టీసీ బస్సులు, మరో 50 ప్రైవేటు బస్సులతో పాటు వందలాది కార్లలో కార్యకర్తలు తరలివెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.సుమారు 15 వేల మంది కార్యకర్తలు, అభిమానులు ఈ సభకు హాజరయ్యేలా ఏర్పాట్లు పూర్తి చేశారు.
ప్రధాని మోదీ రాకతో తెలంగాణ రాజకీయాల్లో నూతన అధ్యాయం మొదలుకానుందని నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సభ జిల్లాలోని పార్టీ క్యాడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని, రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి ఇది ఊపిరి పోస్తుందని భాజపా జిల్లా నాయకత్వం పేర్కొంది. ఆదివారం ఉదయమే ప్రత్యేక వాహనాల్లో కాషాయ జెండాలతో కార్యకర్తలు భాగ్యనగరానికి పయనం అయ్యారు.
