HomeLaw and Orderధాన్యం రవాణాలో నిర్లక్ష్యం కాంట్రాక్టర్ పై కేసు నమోదు కు సిఫార్స్ మిల్లర్లు,...

ధాన్యం రవాణాలో నిర్లక్ష్యం కాంట్రాక్టర్ పై కేసు నమోదు కు సిఫార్స్ మిల్లర్లు, ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్టర్లతో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి సమావేశం..

వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియకు ఆటంకాలు కలిగేలా వ్యవహరిస్తున్న వారిని ఎంతమాత్రం ఉపేక్షించబోమని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. ధాన్యం రవాణాకు లారీలు సమకూర్చని ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్టర్ పై కేసు నమోదు చేయాలని ఆదేశించారు.

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం రైస్ మిల్లర్లు, ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్టర్లతో , కలెక్టర్ సమావేశం నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల నుండి నిర్దేశిత రైస్ మిల్లులకు ధాన్యం తరలించేందుకు సకాలంలో లారీలు సమకూర్చని ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్టర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా పలు చోట్ల రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోందని, రైతుల ప్రయోజనాలను కాపాడే విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమని తేల్చి చెప్పారు. బాల్కొండ సెక్టార్ లో కొనుగోలు కేంద్రాలకు వాహనాలను సమకూర్చడంలో నిర్లక్ష్యం వహిస్తున్న ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్టర్ తీరును తీవ్రంగా పరిగణిస్తూ, సదరు కాంట్రాక్టర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖకు లిఖిత పూర్వకంగా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

రైతులను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అన్ని కొనుగోలు కేంద్రాలకు సరిపడా సంఖ్యలో లారీలను సమకూర్చాలని కాంట్రాక్టర్లకు సూచించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాఫీగా కొనసాగేలా రైస్ మిల్లర్లు కూడా పూర్తి స్థాయిలో సహకరించాలని, రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూడాల్సిన గురుతర బాధ్యత మిల్లర్లపై కూడా ఉందన్నారు.

సరిపడా హమాలీలను సమకూర్చుకుని మిల్లుల వద్ద వెంటవెంటనే ధాన్యం ఆన్ లోడింగ్ జరిగేలా చొరవ చూపాలని మిల్లర్లకు సూచించారు. కడ్తా, తరుగు పేరుతో ఎవరైనా రైతులను నష్టపరిచే చర్యలకు పాల్పడితే కేసులు నమోదు చేయిస్తామని హెచ్చరించారు.

అవసరమైతే నిజామాబాద్ మార్కెట్ యార్డులో పని చేస్తున్న హమాలీ కార్మికుల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ధాన్యం లోడింగ్, ఆన్ లోడింగ్ కు ఎక్కడ కూడా ఇబ్బందులు కలుగకుండా ప్రణాళికాబద్ధంగా, సమన్వయంతో పని చేయాలని సూచించారు.

రైతులు శుభ్రపరచిన ధాన్యాన్ని తేవాలి*కాగా, కొనుగోలు కేంద్రాలకు రైతులు శుభ్రపరచిన ధాన్యాన్ని తరలించి పూర్తి స్థాయిలో ప్రభుత్వం ప్రకటించిన మేరకు మద్దతు ధర పొందాలని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి కోరారు. నాణ్యతా ప్రమాణాలకు లోబడి, శుభ్రపరచిన ధాన్యాన్ని తెస్తే, ఎలాంటి తరుగు, కోత లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తారని అన్నారు.

ఈసారి రబీలో ఆశించిన దానికంటే ఎక్కువగా మొక్కజొన్న, వరి ధాన్యం దిగుబడులు వచ్చాయని, అయినప్పటికీ రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు చేస్తున్నామని అన్నారు. కొంతమంది ప్రజాప్రతినిధులు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం రైతులను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి దుయ్యబట్టారు.

మొక్కజొన్న కొనుగోలు, ధాన్యం సేకరణ విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని, ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులకు ఇబ్బందులు రానివ్వమని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో , రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, డీఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, సివిల్ సప్లైస్ డీఎం ప్రవీణ్, డీసీఓ శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి, డీటీసీ దుర్గా ప్రమీల, మార్కెటింగ్ శాఖ ఏ.డీ గంగుబాయి, మార్కెట్ కమిటీ కార్యదర్శి అర్చన రైస్ మిల్లర్లు, ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments