నగరంలోని సుభాష్నగర్ బాలసదన్ నుంచి ముగ్గురు బాలికలు కనిపించకుండా పోయిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనపై నిజామాబాద్ మూడవ టౌన్ పోలీసులు సత్వరమే స్పందించి ఇద్దరు బాలికలను సురక్షితంగా చేరదీశారు.
మూడవ టౌన్ ఎస్సై హరిబాబు తెలిపిన వివరాల ప్రకారం.. సుభాష్నగర్లోని ప్రభుత్వ బాలసదన్లో నివాసముంటున్న 14, 9, 8 ఏళ్ల వయసు గల ముగ్గురు బాలికలు మంగళవారం వార్డెన్కు సమాచారం ఇవ్వకుండా బయటకు వెళ్లారు. బాలికలు కనిపించకపోవడంతో ఆందోళన చెందిన బాలసదన్ నిర్వాహకులు వెంటనే మూడవ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు అందిన వెంటనే మూడవ టౌన్ ఎస్సై హరిబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీడబ్ల్యూసీ ప్రతినిధులతో కలిసి పోలీసులు ప్రత్యేక బృందాలుగా విడిపోయి బాలికల కోసం గాలింపు చేపట్టారు. బాలికల సొంత ఇళ్ల వద్ద ఆరా తీయగా.. 14 ఏళ్ల, 8 ఏళ్ల బాలికల ఆచూకీ లభ్యమైందన్నారు.
వెంటనే వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు సురక్షితంగా తిరిగి బాలసదన్ అధికారులకు అప్పగించారు.కాగా,9 ఏళ్ల వయసు గల మరో బాలిక అడ్రస్ సరిగ్గా లేకపోవడంతో ఆ పాప ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేశామని, త్వరలోనే ఆ పాపను కూడా కనిపెట్టి సురక్షితంగా తీసుకువస్తామని ఎస్సై హరిబాబు తెలిపారు.
