సెక్యూర్ చైల్డ్ కేర్ ఆస్పత్రి వద్ద బాధితుల ఆందోళనజిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. వాంతులు, విరేచనాలతో ఆస్పత్రిలో చేరిన 16 నెలల చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన నగరంలో కలకలం రేపింది.
బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. జక్రాన్పల్లి మండలం పడకల్ తండాకు చెందిన శిరీష, నరేష్ దంపతుల కుమారుడు నిక్షిత్ (16 నెలలు) సోమవారం రాత్రి వాంతులు, విరేచనాలతో నీరసించిపోయాడు. దీంతో తల్లిదండ్రులు హుటాహుటిన జిల్లా కేంద్రంలోని సెక్యూర్ చైల్డ్ కేర్ ఆస్పత్రికి తరలించారు. బాబును పరీక్షించిన వైద్యులు.. రక్తహీనత ఉందని, హార్ట్ బీట్ తక్కువగా ఉందని చెబుతూ చికిత్స మొదలుపెట్టారు.
అయితే చికిత్స పొందుతున్న సమయంలో బాబు ఒంటిపై దద్దుర్లు రావడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు వైద్యులను నిలదీశారు. వైద్యులు గ్లూకోజ్ సెలైన్లో ఇంజెక్షన్ ఇచ్చి బాబుకు ఎక్కించారు. కాగా, మంగళవారం ఉదయం వైద్యుల సూచన మేరకు ఎంఆర్ఐ స్కాన్ తీయించి తీసుకురాగానే బాబు పరిస్థితి విషమంగా మారింది. కాసేపటికే బాబు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించడంతో తల్లిదండ్రులు నివ్వెరపోయారు.
ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ ప్రాణాలు పోయాయని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న ఒకటవ టౌన్ ఎస్హెచ్ఓ రఘుపతి తన సిబ్బందితో కలిసి ఆస్పత్రికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టారు.
