గత రెండేళ్లుగా తెలంగాణలోని పలు జిల్లాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేస్తూ, వాటిలోని రాగి (కాపర్) కాయిల్స్ను అపహరిస్తున్న ఐదుగురు సభ్యుల అంతర్జిల్లా దొంగల ముఠాను రెంజల్ పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు.
వారి నుంచి రూ. లక్షల విలువైన 80 కిలోల కాపర్ కాయిల్స్, దొంగతనాలకు ఉపయోగించిన 3 మోటార్ సైకిళ్లు, 4 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా వెనుక ఉన్న నలుగురు స్క్రాప్ (పాత ఇనుప సామాను) వ్యాపారులపై కూడా కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ మేరకు శుక్రవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపి సాయి చైతన్య వివరాలు వెల్లడించారు..ఆయన మాట్లాడుతూ.. గురువారం (మే 21) సాయంత్రం 5 గంటల ప్రాంతంలో రెంజల్ సబ్-ఇన్స్పెక్టర్ తన సిబ్బందితో కలిసి సాటాపూర్ బైపాస్ రోడ్డు వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు.
ఆ సమయంలో మూడు మోటార్ సైకిళ్లపై అనుమానాస్పదంగా వస్తున్న ఐదుగురు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీస్ సిబ్బంది వారిని వెంబడించి పట్టుకున్నారు. వారి వద్ద ఉన్న గన్నీ బ్యాగును తనిఖీ చేయగా, అందులో భారీ మొత్తంలో ట్రాన్స్ఫార్మర్ కాపర్ కాయిల్స్ లభ్యమయ్యాయి.
పట్టుబడిన నిందితులను మెదక్, బోధన్ ప్రాంతాలకు చెందిన వనమ్ శైలు (38), జగన్నాధం రామయ్య అలియాస్ శ్రీనివాస్ (37), వనమ్ పోశెట్టి (54), ధనా శ్రీ కిరణ్ (37), దాసరి పోచయ్య (37)లుగా గుర్తించారు. వీరంతా కూలీ, డ్రైవింగ్ పనులు చేస్తూ ఒక గ్యాంగ్గా ఏర్పడ్డారు.
గత రెండేళ్లుగా నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లోని నిర్మానుష్య ప్రాంతాల్లో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను టార్గెట్ చేస్తూ.. మొత్తం 64 ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి రాగి కాయిల్స్ను దొంగిలించినట్లు నిందితులు విచారణలో అంగీకరించారు. నిజామాబాద్ జిల్లా (38): రెంజల్, బోధన్ రూరల్, బోధన్ టౌన్, వర్ని, కోటగిరి, నిజామాబాద్ రూరల్, మోపాల్, డిచ్పల్లి, జక్రాన్పల్లి, ఇందల్వాయి. అలాగే కామారెడ్డి జిల్లా (20): కామారెడ్డి, బాన్సువాడ, పిట్లం, మద్నూర్, భిక్నూర్, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్, పెద్ద కొడప్గల్. మెదక్ జిల్లా (04):మెదక్ రూరల్, చేగుంట, వెల్దుర్తి.సిద్దిపేట జిల్లా (02): అక్కన్నపేట.ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి రాగి కాయిల్స్ను దొంగిలించినట్లు నిందితులు విచారణలో అంగీకరించారు.
దొంగిలించిన కాపర్ కాయిల్స్ను నిందితులు బోధన్, నిజామాబాద్, మేడ్చల్ ప్రాంతాల్లోని స్క్రాప్ వ్యాపారులకు విక్రయిస్తున్నట్లు తేలింది. చోరీ సొత్తు కొనుగోలు చేసినందుకు గాను బోధన్కు చెందిన సయ్యద్ అక్బర్ హుస్సేన్, నిజామాబాద్కు చెందిన షేక్ మహబూబ్లను పోలీసులు అరెస్ట్ చేయగా.. మేడ్చల్ జిల్లా కలకల్, అట్విల్లి గ్రామాలకు చెందిన మలప్ప మాస్టర్ అలియాస్ గౌతమ్, తాయప్ప ధంగల్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు.
వీరి కోసం పోలీసులు గాలిస్తున్నామనీ తెలిపారు. సమర్థవంతంగా పనిచేసి అంతర్జిల్లా దొంగల ముఠా ఆట కట్టించిన బోధన్ ఏసీపీ శ్రీనివాస్, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, సీసీఎస్ ఇన్స్పెక్టర్ సాయినాథ్, రెంజల్ ఎస్ఐ చంద్రమోహన్, బోధన్ రూరల్ ఎస్ఐ మచేందర్ రెడ్డి, సీసీఎస్ ఎస్ఐ విఠల్, హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామ్, కానిస్టేబుళ్లు రవి, ప్రణీత్ రెడ్డి, విశాల్, సర్దార్, కృష్ణ (స్పెషల్ పార్టీ), హోంగార్డ్ హాజీలను జిల్లా పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు.
