నిజామాబాద్ క్రైమ్ రాబోయే పదో తరగతి (ఎస్ఎస్సీ) అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో, సజావుగా నిర్వహించేందుకు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఒక ప్రకటనలో తెలిపారు.
జూన్ 5వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరిగే ఈ పరీక్షల దృష్ట్యా, కేంద్రాల పరిసర ప్రాంతాలలో సెక్షన్ 163 బీఎన్ఎస్అమలులో ఉంటుందని ఆయన వెల్లడించారు. కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల వివరాలను సీపీ వెల్లడించారు.
నిజామాబాద్ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఆదర్శ మహిళా విద్యాలయం, ఆర్మూర్ లోని జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ స్కూల్, బోధన్ టౌన్ రాకాసిపేట్ లోని గర్ల్స్ హైస్కూల్, జూనియర్ కాలేజీల యందు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలు జరిగే రోజుల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షా కేంద్రాల చుట్టూ 100 మీటర్ల పరిధిలో ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని సీపీ స్పష్టం చేశారు.
ఈ నిబంధనల ప్రకారం కేంద్రాల పరిసరాల్లో ఇద్దరి కంటే ఎక్కువ మంది గుంపులుగా చేరడాన్ని పూర్తిగా నిషేధించారు. పరీక్షల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
పరీక్షలు జరిగే రోజుల్లో (జూన్ 5 నుంచి 12 వరకు) ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షా కేంద్రాల సమీపంలో ఉన్న జిరాక్స్ సెంటర్లు, ఇంటర్నెట్ కేఫ్లు, స్టేషనరీ దుకాణాలను తప్పనిసరిగా మూసివేయాలని సంబంధిత యజమానులను సీపీ ఆదేశించారు.
పరీక్షల నిర్వహణ కోసం ప్రతి కేంద్రం వద్ద పోలీస్ అధికారులు, సిబ్బందితో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సీపీ తెలిపారు. కేంద్రాల పరిసరాల్లో తిరిగే అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచుతామని, నిబంధనలను ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సప్లమెంటరీ పరీక్షలు రాయబోతున్న విద్యార్థులందరూ ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా, పూర్తి ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షిస్తూ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య విద్యార్థులకు ‘ఆల్ ది బెస్ట్’ (శుభాకాంక్షలు) తెలిపారు.
