ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను ముందు పెట్టి తెలంగాణలో బీజేపీ ట్రయల్ రన్ చేస్తోంది టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు . మంగళవారంఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ మంచి నటుడు.. సినిమా హీరోగా ఆయన్ను గౌరవిస్తామన్నారు.
అయితే, పవన్ కళ్యాణ్ ఆంధ్రా ప్రాంత నాయకుడని.. ఆయన జనసేన పార్టీ ఏపీలో పుట్టిందని అన్నారు.ఆంధ్రా ప్రాంత నాయకుడికి ఆంధ్రా మూలాలే ఉంటాయని.. ఆంధ్రా మూలాలు ఉన్న వ్యక్తి తెలంగాణలో పార్టీ పెడతానంటే ప్రజలు ఎలా విశ్వసిస్తారని ప్రశ్నించారు.
ఆంధ్రా మూలాలు ఉన్న వ్యక్తి తెలంగాణలో పార్టీ పెట్టీ తెలంగాణ ప్రజలకు న్యాయం చెయ్యలేడన్నారు. ఆంధ్రా ప్రాంత నాయకుడికి ఆంధ్రా మీదనే ప్రేమ ఉంటుందన్నారు. బినామీ అడ్రస్తో వస్తానంటే కుదరని అన్నారు.బీజేపీ, కేసీఆర్తో కుమ్మక్కు అవ్వడం వల్లే తుమ్మిడి హట్టి ప్రాజెక్టును మార్చారని ఆరోపించారు.
ప్రాజెక్టును మార్చి లక్షల కోట్ల రూపాయలు ప్రజా ధనాన్ని వృథా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను నమ్మడం లేదని.. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ వెంటే ఉన్నారని అన్నారు.
