ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దేశ రాజధానిలో అరాచక మూకల మాదిరిగా ప్రవర్తించడం సిగ్గుచేటని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి ధ్వజమెత్తారు. కేవలం రాజకీయ లబ్ధి పొందడం, ప్రజల దృష్టిని ఆకర్షించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఇలాంటి చిల్లర రాజకీయాలకు తెరలేపుతోందని ఆయన తీవ్రంగా విమర్శించారు.
ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.గత 21 రోజులుగా విద్యార్థులు శాంతియుతంగా దీక్షలు చేస్తున్నా ఎవరూ వారిని అడ్డుకోలేదని, కానీ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న వేళ చట్టసభల్లో మాట్లాడాల్సింది పోయి ప్రధాని నివాసం వద్ద ఆందోళనల పేరుతో రాహుల్ గాంధీ నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు.
శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు అరెస్టు చేస్తే, దేశవ్యాప్తంగా అక్రమ అరెస్టులంటూ కాంగ్రెస్ నేతలు హడావిడి చేయడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రధాని నివాసం వద్ద కాంగ్రెస్ నాయకులు ఆందోళనలు చేయవచ్చని, కానీ ప్రజా సమస్యలపై రాష్ట్రంలో బీజేపీ శ్రేణులు గాంధీ భవన్ను ముట్టడించకూడదంటా అని దినేష్ పటేల్ నిలదీశారు.
రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఉద్దేశపూర్వకంగానే ప్రజలను, కార్యకర్తలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై దేశ ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉందని, కాంగ్రెస్ కుట్రలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని స్పష్టం చేశారు.
హైదరాబాద్లో శాంతియుతంగా గాంధీ భవన్ను ముట్టడించడానికి యత్నించిన బీజేపీ శ్రేణులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం, అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తక్షణమే అరెస్టయిన బీజేపీ నాయకులు, కార్యకర్తలను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
