మాదక ద్రవ్యాల రహిత సమాజమే ధ్యేయంగా సైఫాబాద్ పోలీసులు చేస్తున్న కృషిలో భాగంగా, చింతల్ బస్తీలో బుధవారం భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. యువత డ్రగ్స్ బారిన పడకుండా వారిని చైతన్యవంతం చేయడమే లక్ష్యంగా సైఫాబాద్ ఎస్హెచ్ఓ ఎ. సీతయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం సాగింది.
సైఫాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో స్థానిక నిర్మల హైస్కూల్ విద్యార్థులు సుమారు 150 మంది, పాఠశాల ప్రిన్సిపాల్ లక్ష్మి, ఉపాధ్యాయులు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విద్యార్థుల చేతుల్లోని ప్లకార్డులు, వారు చేస్తున్న నినాదాలు చింతల్ బస్తీ వీధుల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
“డ్రగ్స్కు నో – జీవితానికి ఎస్”, “డ్రగ్స్ లేని యువత – బలమైన దేశం” వంటి నినాదాలతో విద్యార్థులు ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్హెచ్ఓ సీతయ్య మాట్లాడుతూ, సమాజంలో డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించడంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలను వివరించారు. డ్రగ్స్ సరఫరా లేదా అమ్మకాలకు సంబంధించి ఎవరికైనా సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. నేటి తరం యువత వ్యసనాలకు దూరంగా ఉంటూ, ఉజ్వల భవిష్యత్తు వైపు సాగాలని ఆయన సూచించారు.
