రాజంపేట కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం తలమడ్ల గ్రామానికి చెందిన సావుసాని శ్రీనాథ్ రెడ్డి (25) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లిన తలమడ్ల గ్రామానికి చెందిన శ్రీనాథ్ రెడ్డి గతేడాది ఎం.ఎస్ చదువుకోడానికి లండన్ వెళ్లాడు.
అక్కడ లీజిస్టర్ నగరంలోని ఓ యూనివర్సిటీలో ఎం.ఎస్ మొదటి సంవత్సరం పూర్తి చేసి రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 22న రాత్రి స్నేహితుడి పుట్టినరోజు వేడుకకు హాజరై తన గదికి చేరుకున్న శ్రీనాథ్, మరుసటి రోజు ఉదయం గదిలోనే మృతిచెంది కనిపించినట్లు సమాచారం.
ఈ విషయాన్ని అక్కడి బంధువులు కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో గ్రామంలో విషాదం నెలకొంది. ఎంతో కష్టపడి ఇంటర్, డిగ్రీ పూర్తి చేసి ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లిన కుమారుడు తిరిగి మృతదేహంతో రావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
