ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనలో హామీల అమలులో వైఫల్యాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు శుక్రవారం నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో గణేష్ బిగాల ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం, మహిళలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. అలాగే కేసీఆర్ కిట్కు ప్రత్యామ్నాయంగా పథకం, కల్యాణలక్ష్మి పథకంలో తులం బంగారం, మహిళలకు స్కూటీలు ఇస్తామని ప్రకటించిందన్నారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు.1000 రోజుల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి మహిళలకు ఇచ్చిన హామీలు ఎక్కడ’ అంటూ ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
హామీల అమలయ్యే వరకు ప్రజల తరఫున బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలను, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మరిన్ని నిరసన కార్యక్రమాలు చేపడతామని గణేష్ బిగాల తెలిపారు.
ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చేలా ప్రజల తరఫున ఒత్తిడి తెస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ మేయర్ దండు నీతూ కిరణ్శేఖర్, నగర అధ్యక్షుడు సిర్ప రాజు, మాజీ నూడా చైర్మన్ ప్రభాకర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
